
గంగమ్మ తల్లికి దీపార్చన
చింతామణి: పట్టణంలోని శాంతినగర ప్రాంతానికి చెందిన మహిళలు గంగమ్మకు దీపాలు సమర్పించి పూజలు జరిపారు. ఉదయమే పెద్దసంఖ్యలో మహిళా భక్తులు పూల దీపాలు ఎత్తుకుని ఆలయానికి వచ్చారు. అమ్మవారికి విశేష మొక్కులు ఉన్నవారు బలిహారం చేశారు. ఈసారి వరుణ దేవుడు కరుణిస్తున్నాడని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని తెలిపారు.
వేంకట రమణుల ప్రతిష్టాపన
బొమ్మనహళ్ళి: బెంగళూరు సిడదేహళ్ళిలో ఉన్న సౌందర్య నగర వెలసిన శ్రీ సౌందర్య వెంకటరమణ స్వామి వారి దేవాలయంలో ప్రతిష్టాపన, బ్రహ్మ కలశాభిషేకం వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉడుపి పేజావర అధోక్షజ మఠాధిపతి విశ్వ ప్రసన్న తీర్థ స్వామి పాల్గొని ప్రతిష్టాపన పూజలు చేశారు. బెళ్తంగడికి చెందిన విద్వాన్ కే.ఆర్. శశాంక ఇన్నెంజెత్తాయ తదితర పండితులు శాస్త్రోక్తంగా బ్రహ్మ కలశాభిషేకం జరిపించారు. విశ్వ ప్రసన్న తీర్థ స్వామి మాట్లాడుతూ భక్తి అంటే సర్వస్వాన్ని సమర్పించడమని, మనం అందరం ఖాళీ చేతులతో వచ్చిన వారమని, దేవున్ని నమ్ముకొని పూజించాలని, అదే మనం భగవంతునికి ఇచ్చే నిజమైన నైవేద్యమని అన్నారు. పెద్దసంఖ్యలో భక్తులు వెంకట రమణస్వామిని దర్శించుకున్నారు.
జాడ లేని ఎమ్మెల్యే మునిరత్న
యశవంతపుర: మహిళపై అత్యాచారం కేసులో నిందితునిగా ఉన్న రాజరాజేశ్వరనగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నను పోలీసులు అరెస్టుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే అదృశ్యమయ్యారు. ఎమ్మెల్యే ఆఫీసులో ఆయన అనుచరులు మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ముఖంపై మూత్ర విసర్జన చేసి, ప్రమాదకర వైరస్ను ఎక్కించారని ఇటీవల ఆర్ఎంసీ యార్డు ఠాణాలో ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ కేసును సిట్కి బదిలీ చేశారు. సిట్ పోలీసులు అరెస్ట్ చేయవచ్చని ప్రచారం సాగింది, ఇంతలోనే మునిరత్న రెండు రోజుల నుంచి ఎవరికీ కనిపించడం లేదు. పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మొబైల్ నంబర్ స్విచ్ ఆఫ్ అయ్యింది. మరోవైపు ముందస్తు బెయిల్కు హైకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిసింది.
చాముండి రథోత్సవం
మండ్య: మండ్య నగరంలోని శ్రీచాముండేశ్వరి లేఔట్లోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో బ్రహ్మరథోత్సవం శుక్రవారం రమణీయంగా జరిగింది. ఉదయం నుంచి అమ్మవారి ఆలయంలో గణపతిపూజ, దుర్గా హోమం, దేవికి రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించి మహా మంగళ హారతి ఇచ్చారు. చండికా పారాయణం నిర్వహించారు. మధ్యాహ్నం 12 నుంచి 12:45 గంటల మధ్య అభిజిత్ ముహూర్తంలో భక్తులు అమ్మవారి రథోత్సవానని నిర్వహించారు. పిల్లలూ, పెద్దలూ ఉత్సాహంగా తేరును లాగారు.
ఆల్మట్టి ఎత్తును పెంచుతాం
● డిప్యూటీ సీఎం శివకుమార్
సాక్షి, బళ్లారి: కృష్ణా నదిపై ఆల్మట్టి డ్యాం ఎత్తును 524 మీటర్లకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు. శుక్రవారం ఆయన విజయపుర జిల్లా కొల్హారలో వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొని మాట్లాడారు. తగిన నివేదిక రూపొందించి కేంద్ర మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఎత్తును పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరామన్నారు. డ్యాం ఎత్తు పెంచితే ఆయకట్టు విస్తీర్ణం పెరిగి ఈ ప్రాంత రైతులకు మేలు కలుగుతుందని చెప్పారు. కృష్ణా ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇది మహా మానవతావాది బసవణ్ణ జన్మించిన ప్రాంతమని, సమాజంలో శాంతి, సమానత కోసం శ్రమించారని అన్నారు.

గంగమ్మ తల్లికి దీపార్చన

గంగమ్మ తల్లికి దీపార్చన