
ఆరో గ్యారంటీ.. ధరల పెంపు
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఐదు గ్యారెంటీలు అమలు చేస్తామని, ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని, ఆరో గ్యారంటీ కూడా ఇస్తోందని, అదే ధరల పెంపుదల, సామాన్యుల జీవిత విధానానికి విఘాతం కలిగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర పేర్కొన్నారు. ఆయన బుధవారం యాదగిరి నగరంలో జనాక్రోశ సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఆక్రోశం రోజు రోజుకు పెరుగుతోందన్నారు. ఒక చేత్తో ఇచ్చి, ఇంకో చేత్తో లాక్కొంటున్నారని మండిపడ్డారు. ఆరో గ్యారెంటీకి ఎలాంటి ప్రచారం చేసుకోవడం లేదని వ్యంగ్యంగా అన్నారు. దాదాపు 50కి పైగా నిత్యావసర వస్తువుల ధరలను పెంచారన్నారు. దీంతో పేదలకు ఎంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
జనాక్రోశ యాత్రకు విశేష స్పందన
ప్రతి గ్రామంలో జనం కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. తాము చేపట్టిన జనాక్రోశ యాత్రకు విశేష స్పందన లభిస్తోందన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు అమాంతంగా పెంచేస్తున్నారన్నారు. యడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడు రైతులు హితదృష్టితో పని చేశారని, సిద్దరామయ్య సర్కార్ ఎవరి హితదృష్టితో పని చేస్తోందో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరో గ్యారంటీ అమలు చేయడంతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి ఆనందం పొందుతోందన్నారు. ఉగ్రవాదులు దాడులను కూకటివేళ్లతో పెకలించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కశ్మీరులో హిందువులపై జరిగిన దాడులు అత్యంత హేయమైన చర్యగా, పిరికిపందలు చేసే అకృత్యం అని మండిపడ్డారు.
కేంద్రం గట్టి చర్యలు తీసుకుంటుంది
ఉగ్రవాదులపై కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన వచ్చి భవిష్యత్తు ప్రణాళికలపై చర్చిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. యావత్ దేశం ఉలిక్కిపడేలా ఉగ్రవాదులు భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఇందుకు 100 రెట్టు నష్టం వారు అనుభవిస్తారని గుర్తు చేశారు. కశ్మీరులో హిందూ పండిట్లకు కూడా అవమానం చేశారని, సైనికుల మృతి కూడా కారణం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీరులో హిందువులపై జరుగుతున్న మారణకాండకు ఖచ్చితంగా పుల్స్టాప్ పెట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఉగ్రవాదులకు మూలాలు లేకుండా చేయాలన్నారు. మాజీ మంత్రి శ్రీరాములు, బీజేపీ రాష్ట్ర నేత, ఎమ్మెల్సీలు చలవాది నారాయణస్వామి, రవికుమార్ పాల్గొన్నారు.
ఎడమ చేత్తో ఇస్తూ కుడి చేత్తో
లాక్కొంటోంది
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించాలి
ఉగ్రవాదులు ఖచ్చితంగా
తగిన మూల్యం చెల్లిస్తారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై. విజయేంద్ర