
రెడ్డి జనాభాను తక్కువ చూపితే సమరమే
బొమ్మనహళ్లి: రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక,ఆర్థిక సర్వేలో రెడ్డి సామాజిక వర్గం జనాభా తక్కువగా ఉందనే కారణం చూపుతూ రెడ్డి ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం మీద ఉగ్ర పోరాటం చేస్తామని కర్ణాటక రెడ్డి జన సంఘం హెచ్చరించింది. నివేదిక గురించి రెడ్డి జన సంఘం డైరెక్టర్లు, బోర్డు సభ్యులు, జిల్లా, తాలూకా నాయకులు, పదాధికారులు బెంగళూరులో సమావేశమై చర్చించారు. ఆ సమావేశ వివరాలను సంఘం అధ్యక్షుడు జయరామ్రెడ్డి మీడియా భేటీలో వెల్లడించారు.
మేమే కులగణన చేపడతాం
రాష్ట్రంలో రెడ్డి సముదాయం జనాభా 35 లక్షల నుంచి 40 లక్షల వరకూ ఉందని జమరామ్రెడ్డి తెలిపారు. కులగణన నివేదికలో 7.50 లక్షలు మాత్రమే ఉందని చూపుతున్నారని చెప్పారు. మా సంఘం ద్వారా రెడ్డి జనాభా గణనను నిర్వహిస్తామని సర్కారుకు సవాల్ చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వానికి పంపుతామని అన్నారు. ప్రభుత్వం మా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే పోరాటం సాగిస్తామని చెప్పారు. రెడ్డి జనాభాకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని, తమను బీసీలలో చేర్చాలని ఇదివరకే సీఎం సిద్దరామయ్యను కలిసి కోరినట్లు తెలిపారు. సంఘం శతాబ్ది ఉత్సవాలకు ముందే ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు వెంకటశివారెడ్డి, కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్రెడ్డి, అన్ని జిల్లాల సుమారు 450 మందికి పైగా నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 40 లక్షలు ఉంటే, 7.5 లక్షలని చెప్పడం సరికాదు
కులగణన నివేదికపై రెడ్డి జనసంఘం నేతల ధ్వజం
బెంగళూరులో కార్యాచరణపై చర్చ