అడవిని వీడిన మావోయిస్టు నేత | - | Sakshi
Sakshi News home page

అడవిని వీడిన మావోయిస్టు నేత

Dec 3 2025 7:18 PM | Updated on Dec 3 2025 7:18 PM

అడవిని వీడిన మావోయిస్టు నేత

అడవిని వీడిన మావోయిస్టు నేత

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సీపీఐ మావోయిస్టు పార్టీలో దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ సౌత్‌ బస్తర్‌ చైతన్య నాట్య మంచ్‌ (సీఎన్‌ఎం) లో డివిజన్‌ కమిటీ సెక్రెటరీగా పనిచేస్తున్న జిల్లాకు చెందిన మావోయిస్ట్‌ పార్టీ నేత లోకేటి రమేశ్‌ అలియాస్‌ అశోక్‌ అలియాస్‌ రాజేశ్వర్‌ అలియాస్‌ నరేందర్‌ జనజీవన స్రవంతిలో కలిశాడు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని జనగామ డీసీపీ సమక్షంలో మంగళవారం ఆయన పోలీసులకు లొంగిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.

కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్‌ అలియాస్‌ స్వామి అలియాస్‌ ప్రభాకర్‌ మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. జిల్లా కార్యదర్శిగా పనిచేసిన స్వామి అలియాస్‌ చందర్‌ను పార్టీ దండకారణ్యానికి బదిలీ చేసింది. ఆయన వెళ్లిన కొద్దికాలానికే భార్య సులోచన కూడా అడవిబాట పట్టింది. ఎనిమిదేళ్ల క్రితం సులోచన అనారోగ్యంతో మృతిచెందింది. వారి పిల్లలు లోకేటి రమేశ్‌, లోకేటి లావణ్యలు బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్నారు. 2005లో రమేశ్‌, లావణ్యలు కూడా తల్లిదండ్రులు నడిచిన బాటలోనే నడిచారు. నలుగురు కూడా దండకారణ్యంలోని వివిధ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. కాగా స్వామి కొడుకు రమేశ్‌ అలియాస్‌ అశోక్‌ అలియాస్‌ రాజేశ్వర్‌ అలియాస్‌ నరేందర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిన తరువాత ఏడాది కాలం పాటు సీసీఎం పోతుల కల్పన దగ్గర పనిచేసి చైతన్య నాట్య మంచ్‌కు బదిలీ అయ్యాడు. 2008 లో ఏరియా కమిటీ మెంబర్‌గా పదోన్నతి పొంది 2011 వరకు చైతన్య నాట్య మంచ్‌లో పనిచేశాడు. 2012లో ఊసూర్‌ ఎల్‌వోఎస్‌ కమాండర్‌గా బదిలీ అయ్యాడు. 2013లో డీవీసీఎంగా పదోన్నతి పొంది పామేడ్‌ ఏరియా కమిటీకి సెక్రెటరీగా వెళ్లాడు. 2019 లో జేగురుగొండ ఎల్‌వోఎస్‌ కమాండర్‌గా పనిచేశాడు. 2021లో చైతన్య నాట్య మంచ్‌ డీవీసీఎస్‌ సెక్రెటరీగా పదోన్నతి పొంది మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సౌత్‌ బస్తర్‌ డివిజనల్‌ కమిటీ పరిధిలో ఇప్పటి దాకా కొనసాగినట్టు పోలీసులు తెలిపారు.

రూ.8 లక్షల రివార్డు..

పోలీసులకు లొంగిపోయిన లోకేటి రమేశ్‌పై రూ.8 లక్షల రివార్డు ఉంది. లొంగుబాటు సందర్భంగా రూ.25 వేలు పోలీసులు రమేశ్‌కు అందజేశారు. ఆయనపై ఉన్న రివార్డును త్వరలోనే అందజేయనున్నారు. రమేశ్‌ మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న క్రమంలో 2016లో పామేడ్‌ ఎల్‌వోఎస్‌ కమాండర్‌ గొట్టా బొజ్జి అలియాస్‌ కమలను వివాహం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కమల 2023లో అరెస్టు అయి జైలులో ఉందని వెల్లడించారు. జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రమేశ్‌ లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

జనగామ జిల్లాలో లొంగిపోయిన జిల్లాకు చెందిన లోకేటి రమేశ్‌

రెండు దశాబ్దాలుగా అజ్ఞాతంలో..

కుటుంబమంతా మావోయిస్టు

పార్టీలోనే..

జైలులో భార్య కమల

దండకారణ్యంలో వెస్ట్‌ జోనల్‌ బ్యూరో సెక్రెటరీగా పనిచేస్తున్న

తండ్రి స్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement