
రహదారి విస్తరణతో తొలగుతున్న మలుపులు
ఎల్లారెడ్డి: హైదరాబాద్ –మెదక్ –బోధన్(హెచ్ఎంబీ) జాతీయ రహదారి(765 డి) విస్తరణలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు మలుపులను తొలగిస్తున్నారు. దీంతో వాహనదారులకు దూరభారం తగ్గనుంది. 765 డి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా దిండిగల్ నుంచి రుద్రూర్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇప్పటికే దిండిగల్ నుంచి మెదక్ వరకు 10 మీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. టూ లైన్ విత్ పేవ్డ్ షోల్డర్స్ పద్ధతిన మెదక్ నుంచి రుద్రూర్ వరకు కొత్త డిజైన్ ప్రకారం జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. దిండిగల్ నుంచి నర్సాపూర్ అటవీ ప్రాంతం గుండా మెదక్ వరకు నిర్మించిన రోడ్డులో భారీ మలుపులను తొలగించి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం మెదక్ నుంచి రుద్రూర్ వరకు జరుగుతున్న రోడ్డు పనులలో భాగంగా మెదక్ శివారులోని ఔరంగాబాద్, హవేళీ ఘణపురం, పోచారం అభయారణ్యం, ప్రాజెక్ట్ పైబ్రిడ్జి నిర్మాణంతో బైపాస్ రోడ్డు, తాండూర్ గేట్, జానకంపల్లి, మెల్లకుంట తండా, కన్నారెడ్డి, మాచాపూర్ గ్రామాల వద్ద ఎల్లారెడ్డి వరకు భారీ మలుపులను తొలగించా రు. ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ వరకు లింగారెడ్డిపేట్, తిమ్మారెడ్డి, అన్నాసాగర్, కామ్శెట్టిపల్లి, నస్రుల్లాబాద్ ప్రాంతాలలో భారీ మలుపులను తొలగించి నేరుగా రోడ్డు వేస్తున్నారు. దిండిగల్ నుంచి రుద్రూర్ వరకు మలుపులను తొలగించడం వల్ల సుమారు 35 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం ఎల్లారెడ్డి నుంచి సికింద్రాబాద్ బస్టాండ్ వరకు గతంలో 138 కిలోమీటర్ల దూరం ఉండగా కొత్త రోడ్డు నిర్మాణంతో 125 కిలోమీటర్లకు తగ్గనున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణంలో భారీ మలుపులను తొలగించడం వల్ల దూరభారం తగ్గనుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తగ్గనున్న దూరభారం
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

రహదారి విస్తరణతో తొలగుతున్న మలుపులు

రహదారి విస్తరణతో తొలగుతున్న మలుపులు