యంత్ర సేవపై కుతంత్రం | - | Sakshi
Sakshi News home page

యంత్ర సేవపై కుతంత్రం

Nov 16 2025 10:25 AM | Updated on Nov 16 2025 10:39 AM

వ్యవసాయ యంత్రాల

రాయితీకి మంగళం

రెండేళ్లుగా ఒక్క పరికరమూ

ఇవ్వని చంద్రబాబు సర్కారు

పెరిగిన కూలి రేట్లు

యంత్రాలు దొరక్క రైతులకు ఇక్కట్లు

అధిక రేట్లకు ఇతర ప్రాంతాల నుంచి అద్దెకు తెచ్చుకుంటూ అవస్థలు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రైతులు ఆధునిక యంత్రాల సాయంతో పంటలు పండించాలని చెబుతూనే.. యంత్ర రాయితీ పథకానికి చంద్రబాబు సర్కారు మంగళం పాడింది. ఈ పథకం ద్వారా రైతులకు ఏటా 50 శాతం రాయితీపై వ్యవసాయానికి సంబంధించిన యంత్ర పరికరాలు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో 2 లక్షల మందికి పైగా రైతులున్నారు. వీరు 2.12 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. వీరికి విత్తు నుంచి కోతల వరకూ వివిధ దశల్లో ఉపయోగపడే యంత్ర పరికరాలను యంత్ర సేవా పథకం ద్వారా ప్రభుత్వం అందజేయాలి. దుక్కులు, దమ్ములు చేసుకునేందుకు ట్రాక్టర్లు, డ్రమ్‌ సీడర్లు, వరి కోత యంత్రాలతో పాటు ఇతర పరికరాలను ఈ పథకంలో ఇచ్చేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఒక్క రైతుకు కూడా రాయితీ పరికరాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత గత ఏడాది ఖరీఫ్‌, రబీతో పాటు ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ కూడా ముగిసింది. కానీ, ఇప్పటి వరకూ రైతులకు టార్పాలిన్లు, స్ప్రేయర్లు, వరి కోత యంత్రాలు, మినీ ట్రాక్టర్లలో ఏ ఒక్కటీ మంజూరు చేయలేదు. అసలు ఆ ఊసే తేవడం లేదు. యంత్ర సేవా పథకానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేస్తుంది. అయినప్పటికీ అవి ఏమయ్యాయో.. రైతులకు పరికరాలు ఎందుకు ఇవ్వలేదో అర్థం కాని ప్రశ్నగానే మిగిలింది.

అద్దెకు తెచ్చుకుంటూ..

ప్రతి గ్రామంలో సుమారు 2 వేల నుంచి 3 వేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఓవైపు కూలి రేట్లు అధికంగా ఉంటున్నాయి. మరోవైపు ఆయా గ్రామాల్లో సీజన్‌లో వ్యవసాయ యంత్ర పరికరాలు దొరకని పరిస్థితి. దీంతో, రైతులు గత్యంతరం లేక ఇతర ప్రాంతాల నుంచి ఆయా యంత్రాలను అధిక రేట్లకు అద్దెకు తెచ్చుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలోని రైతులు ఒడిశా, బిహార్‌, పంజాబ్‌ వంటి రాష్ట్రాల నుంచి వరి కోత యంత్రాలను అద్దెకు తెచ్చుకోవాల్సి వస్తోంది. గత రబీ కోతల సమయంలో భారీ వర్ష సూచనలు రావడంతో రైతులు హడావుడి పడ్డారు. ఇదే అదనుగా పలువురు దళారులు వరి కోత యంత్రాలను ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి అద్దెల పేరిట దండిగా గుంజారు. అప్పట్లో ఎకరం వరి కోతకు ఏకంగా రూ.3,500 వసూలు చేశారు. అవే వరి కోత యంత్రాలు స్థానికంగా అందుబాటులో ఉంటే రూ.2,500 మాత్రమే అద్దె ఉండేది. వర్ష సూచనల నేపథ్యంలో రైతులు మరో దారి లేక వరి కోత యంత్రానికి ఎక్కువ రేటు చెల్లించుకోవాల్సి వచ్చింది.

టార్పాలిన్లకు సైతం..

కోతలు పూర్తయిన తర్వాత ధాన్యం ఆరబోసుకొనేందుకు రైతులకు టార్పాలిన్‌ అవసరం. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతులకు కావాల్సిన టార్పాలిన్లను 50 శాతం రాయితీపై అందించేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సైతం ఇవ్వలేదు. తేమ శాతం ఎక్కువగా ఉంటే మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు సుమారు 10 రోజుల పాటు ధాన్యం ఎండబెట్టాల్సి వచ్చింది. ఎకరం పొలంలో ధాన్యం ఎండపోసేందుకు ఐదారు టార్పాలిన్లు అవసరం. ఈవిధంగా రైతులు ఒక్కో టార్పాలిన్‌ను రోజుకు రూ.50 చొప్పున అద్దెకు తెచ్చుకున్నారు. కొందరు రైతులు 20 రోజుల వరకూ ధాన్యం తరలించపోవడంతో అన్ని రోజులకూ అద్దె చెల్లించాల్సి వచ్చింది. అదే ప్రభుత్వం రాయితీపై ఇస్తే ఆ టార్పాలిన్లు రైతులకు రెండు మూడేళ్ల పాటు ఉపయోగపడేవి. వారికి అద్దె బాధ కూడా తప్పేది. చంద్రబాబు ప్రభుత్వం స్ప్రేయర్లు సైతం ఇవ్వకపోవడంతో రైతులు గత ఖరీఫ్‌, రబీ సీజన్లలో వాటిని అద్దెకు తెచ్చుకొనే పురుగు మందులు పిచికారీ చేసుకోవాల్సి వచ్చింది.

కూలీల కొరత

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల కొరత అధికంగా ఉంది. ఆయకట్టుకు తగిన విధంగా కూలీలు దొరకడం లేదు. గతంలో వేరే ప్రాంతాల నుంచి కూలీలు వలస వచ్చి వరి నాట్లు, కలుపుతీత, కోతల వంటి పనులు చేసేవారు. దీంతో, కూలీల కొరత కొంత మేర తగ్గేది. ప్రస్తుతం వలస కూలీలు అస్సలు రావడం లేదు. దీంతో, స్థానిక కూలీలతో పనులు చేయించడం రైతులకు కష్టసాధ్యమైపోయింది. పైగా, ఎకరం వరి కోత కోయాలంటే ప్రస్తుత రేట్ల ప్రకారం రూ.6 వేల వరకూ కూలి చెల్లించాలి. కుప్ప నూర్పిడికి ట్రాక్టర్‌, కూలీలకు మరో రూ.6 వేలు అవుతుంది. అదే, వరి కోత యంత్రం అందుబాటులో ఉంటే రూ.3,500 ఈ పనులైపోతాయి. ధాన్యం ఆరబోతకు టార్పాలిన్లు, ఒకరిద్దరు కూలీలకు మరో రూ.3 వేలు ఖర్చవుతుంది. ఇలా చూసుకున్నా రైతుకు రూ.6 వేలు మిగులుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని యంత్ర సేవా పథకం కింద వ్యవసాయ పరికరాలు వెంటనే అందించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

వైఎస్సార్‌ సీపీ హయాంలో..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా క్రమం తప్పకుండా రైతులకు, రైతు సేవా సంఘాలకు యంత్ర సేవా పథకం కింద రాయితీపై పరికరాలు అందించేవారు. గత ప్రభుత్వ హయాంలో 2,431 మంది రైతులకు, 150 రైతు సేవా సంఘాలకు రూ.27.52 కోట్ల విలువైన యంత్ర పరికరాలు అందజేశారు. గ్రామాల్లో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, రైతులకు కావాల్సిన యంత్ర పరికరాలను తక్కువ రేట్లకే అద్దెకు ఇచ్చేవారు. ఈ విధానానికి కూడా చంద్రబాబు సర్కారు స్వస్తి పలికింది. దీంతో, దళారుల వద్ద రైతులు యంత్ర పరికరాలు తెచ్చుకుని అధిక మొత్తంలో అద్దెలు చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

ఈ పథకం పునరుద్ధరించాలి

ఖరీఫ్‌, రబీ సీజన్లలో యంత్ర పరికరాలు పూర్తి స్థాయిలో లేవు. బయటి నుంచి వచ్చే వరి కోత యంత్రాలపై ఆధారపడి కోతలు కోయడం వల్ల ఎకరాకు రూ.2 వేలు వరకూ అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వం యంత్రాలు ఇస్తే తీసుకొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వరి కోతలు చురుగ్గా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కోత యంత్రాలు పూర్తి స్థాయిలో దొరకడం లేదు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యంత్ర సేవా పథకాన్ని వెంటనే పునరుద్ధరించి, పరికరాలు మంజూరు చేయాలి. – అడబాల గోవిందు, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం

యంత్ర సేవపై కుతంత్రం1
1/1

యంత్ర సేవపై కుతంత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement