
వంచనపై సమరభేరి
సర్కార్కు కనువిప్పు కలగాలి
యువత పోరుతో కూటమి సర్కార్కు కనువిప్పు కలగాలి. విద్యా సంవత్సరం ముగిసిపోయినా ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం దగా చేస్తోంది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. దీనంతటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. మంత్రి లోకేష్ తాము ఇచ్చిన 31 హామీలు 31 కెమెరాల్లో ఫీడ్ చేసుకోమని నాడు ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఇప్పుడేమో రెడ్బుక్ పట్టుకుని తిరుగుతున్నారే తప్ప హామీలు, సంక్షేమ పథకాలను పట్టించుకోవడం లేదు. ఫీజుల ఇబ్బందుల నుంచి విద్యార్థులను బయటపడేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
– రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), వైఎస్సార్ సీపీ
యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కాకినాడ
హామీలు అమలు చేయాలి
హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్న కూటమి సర్కారుపై యువత తిరగబడింది. ఇది తొలి అడుగుగా గుర్తెరిగి విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపించేలా యువత పోరుకు విద్యార్థులు, యువత తరలివచ్చారు. ప్రభుత్వంపై ఏడాది కాలంగా నెలకొన్న వ్యతిరేకతకు ఇది అద్దం పడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా, వసతి దీవెనలను అటకెక్కించిన సర్కారు.. విద్యార్థులను రోడ్డు పాలు చేసింది.
– పూసల అనిల్ కుమార్, వైఎస్సార్ సీపీ
విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు, కాకినాడ
● కదం తొక్కిన విద్యార్థులు, యువత
● కాకినాడలో భారీ ర్యాలీ
● కూటమి సర్కారు మోసంపై ఆగ్రహం
● ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి తక్షణం ఇవ్వాలని డిమాండ్
● దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు
● కలెక్టర్కు వినతి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఉద్యోగాలిస్తాం.. ఇవ్వలేకుంటే నెలనెలా రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తాం. విద్యా సంవత్సరం ముగియకుండానే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తాం’ అంటూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు చంద్రబాబు అండ్ కో నమ్మించారు. తీరా గద్దెనెక్కిన తర్వాత తమను నిలువునా వంచించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు, యువత సోమవారం పెద్ద ఎత్తున కదం తొక్కారు. కూటమి నేతల మాయమాటలతో దగా పడిన విద్యార్థులు, యువత జిల్లా నలుమూలల నుంచీ తరలివచ్చి, కూటమి సర్కారు తీరును నిరసిస్తూ ప్లకార్డులు చేతబట్టి కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీలు ఏడాది కాలంగా అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ‘యువత పోరు’ పిలుపే ప్రభంజనమైనట్లు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచీ వేలాదిగా తరలివచ్చారు.
యువ‘జన ప్రవాహం’
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువత కాకినాడ బాలా త్రిపుర సుందరి ఆలయం సమీపాన ఉన్న వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయానికి తరలివచ్చారు. అక్కడి నుంచి పార్టీ నేతలు వెంట రాగా దిక్కులు పిక్కటిల్లేలా పెద్ద పెట్టున నినాదాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పిండాల చెరువు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం, మెక్లారిన్ కాలేజీ, పీఆర్ కాలేజీ, జిల్లా పరిషత్ జంక్షన్, సివిల్ సప్లైస్ పెట్రోల్ బంకు, ఆర్డీఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ వరకూ ఈ ప్రదర్శన సాగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ ముందు భాగంలో నిలిచారు. పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ పార్టీ నేతలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి, కూటమి సర్కారు మోసాలను ఎండగడుతూ ప్రదర్శనలో పాల్గొన్నారు. పార్టీ సిటీ కార్యాలయం వద్ద బయలుదేరిన దగ్గర నుంచి జెడ్పీ సెంటర్ వరకూ ఆ మార్గమంతా కిక్కిరిసిపోయింది. ర్యాలీ జరిగిన రోడ్డు యువ జాతరను తలపించింది. ‘చంద్రబాబూ.. ఎన్నికల్లో ఇచ్చిన మాట ఏమైంది సిగ్గు సిగ్గు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా మోసం చేస్తారా సిగ్గు సిగ్గు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సిగ్గు సిగ్గు, నాడు మామకు వెన్నుపోటు – నేడు యువతకు వెన్నుపోటు’ అంటూ ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. ర్యాలీగా తరలివచ్చిన విద్యార్థులు, యువత, పార్టీ నేతలు కలెక్టరేట్కు చేరుకున్నారు. ప్రధాన గేటు ద్వారా కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పది మంది ముఖ్య నేతలను మాత్రమే అనుమతించడంతో, వారు వెళ్లి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.
యువతపోరు విజయవంతం కావడం వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ, పిఠాపురం కో ఆర్డినేటర్ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నాగులాపల్లి ధనలక్ష్మి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, పార్టీ యువజన, విద్యార్థి, మహిళా విభాగాల జిల్లా అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), పూసల అనిల్కుమార్, వర్ధినీడి సుజాత, రాష్ట్ర మహిళా కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కాకినాడ సిటీ యూత్, విద్యార్థి విభాగాల అధ్యక్షులు రోకళ్ల సత్యనారాయణ, జలగడుగుల పృథ్వి, సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జమ్మలమడక నాగమణి, పార్టీ ముఖ్య నేతలు సుంకర విద్యాసాగర్, వాసిరెడ్డి జమీలు, అల్లి రాజబాబు, నాగం గంగబాబు, లాలం బాబ్జీ, రావూరి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల లోవరాజు, బెజవాడ సత్యనారాయణ, బెండా విష్ణు, కొప్పన శివ, గండ్రేడు రాము, గండేపల్లి బాబీ, మాదిరెడ్డి దొరబాబు, దాసం వెంకటేష్, కారే శ్రీనివాస్, ఆనాల సుదర్శన్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర, జిల్లా నాయకులు తోట శ్రీరాంజీ, బదిరెడ్డి గోవిందు, సకురు గుర్రాజు, ఎంజీకే కిశోర్, కరణం భాను, వీరంరెడ్డి నాని, మాదేపల్లి రాజబాబు, మాదారపు నాని, సీడీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు దగా
విద్యార్థులకు కూటమి సర్కార్ వేల కోట్ల రూపాయలు బకాయి పడింది. విద్యా సంవత్సరం ముగియకుండానే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులను రోడ్డున పడేసింది. సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోంది. వారానికో ఈవెంట్ చేస్తూ ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే ప్రభుత్వంలా మారింది. ప్రజల్లోకి జగన్మోహన్రెడ్డి గళం వెళ్లకుండా ఉండేందుకు కుట్రలు చేస్తోంది. ప్రజలకు జగన్ నుంచి సహకారం అందకుండా చేయాలనుకుంటోంది. ఒక వ్యూహం ప్రకారం ప్రతిపక్షమనేది లేకుండా చేయాలని చంద్రబాబు అండ్ కో కుయుక్తులు పన్నుతున్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 80 ఏళ్ల వయసులో కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్రెడ్డి తలకాయ నరికేస్తానంటూ ఒక ఎమ్మెల్యేగా ఆయన ఎలా మాట్లాడతారు? హామీలు అమలు చేయాలని, రాష్ట్ర సమస్యల పైన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని జగన్ నిలదీశారు. మీడియా నుంచి వచ్చిన రప్పా రప్పా అనే ప్రశ్నకు ఆయన సమాధానం మాత్రమే చెప్పారు. ఒక టీడీపీ కార్యకర్త మోసపోయామనే బాధతో రప్పా రప్పా అని ఫ్లెక్సీ పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అది సినిమా డైలాగ్ తప్ప మరొకటి కాదని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం ఈ డైలాగ్ను టాపిక్ డైవర్షన్ కోసం వాడుకుంటోంది. నిరుద్యోగ భృతి రప్పా, ఫీజు రీయింబర్స్మెంట్ రప్పా రప్పా, హామీలన్నీ రప్పా రప్పా కాదా?
– దాడిశెట్టి రాజా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు

వంచనపై సమరభేరి

వంచనపై సమరభేరి

వంచనపై సమరభేరి

వంచనపై సమరభేరి