
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఏకాదశి పర్వదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారికి ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. శృంగార వల్లభుడిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేశఖండన, వివిధ సేవల టికెట్లు, అన్నదాన విరాళాలుగా స్వామి వారికి రూ.3,09,209 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. సుమారు 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.