
21 నుంచి ట్రాఫిక్ మళ్లింపు
సామర్లకోట: భారత్ మాల జాతీయ రహదారి బ్రిడ్జి పనుల నేపథ్యంలో ఈ నెల 21 నుంచి సామర్లకోట – కాకినాడ కెనాల్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లించనున్నారు. అచ్చంపేట జంక్షన్ నుంచి సామర్లకోట ఏడీబీ రోడ్డులోని రాక్ సిరామిక్స్ వరకూ ఈ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ మార్గంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జికి స్తంభాల నిర్మాణం అధునాతన సాంకేతిక పద్ధతిలో పూర్తి చేశారు. ఈ స్తంభాలను కలుపుతూ రెడీమేడ్ గర్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వాటిని ఆయా ప్రదేశాలకు చేర్చారు. సామర్లకోట – కాకినాడ రోడ్డులో ముత్యాలమ్మ ఆలయం వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జికి ఈ నెల 21 నుంచి ఈ గర్డర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సామర్లకోట – కాకినాడ కెనాల్ రోడ్డులో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకూ ట్రాఫిక్ మళ్లించాలని కలెక్టర్ షణ్మోహన్ ఇప్పటికే ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సామర్లకోట – కాకినాడ మధ్య ప్రయాణించే వారు అచ్చంపేట, పనసపాడు, సర్పవరం మీదుగా వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, అచ్చంపేట – సామర్లకోట మధ్య ఉన్న బ్రిడ్జిలో ఈ నెల 27 నుంచి గర్డర్లు ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో సామర్లకోట – అచ్చంపేట ఏడీబీ రోడ్డులో వాహనాలను ఈ నెల 27, 28 తేదీల్లో కెనాల్ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు.

21 నుంచి ట్రాఫిక్ మళ్లింపు