
ఆధునిక హంగులు.. సౌకర్యాలు
● సింగరేణిలో డబుల్, ట్రిపుల్ బెడ్రూం క్వార్టర్లు
● అధికారులకు 143, కార్మికులకు 860 క్వార్టర్లు
● 1,003 క్వార్టర్లకు రూ.450 కోట్లు కేటాయింపు
గోదావరిఖని(రామగుండం): సంస్థవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఆధునిక హంగులతో క్వార్టర్లను నిర్మించేందుకు యాజమాన్యం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జీప్లస్ వన్ పద్ధతిలో అధికారులకు ట్రిపుల్ బెడ్రూం, కార్మికులకు డబుల్ బెడ్రూం నిర్మించనున్నారు. ఈమేరకు సింగరేణి బోర్డు ఆమోదం పొందింది. అధికారులు, ఉద్యోగుల 1,003 క్వార్టర్ల నిర్మాణానికి రూ.450కోట్లు కేటాయించింది. గోదావరిఖని, శ్రీరాంపూర్, భూపాలపల్లి, మణుగూర్ ప్రాంతాల్లో క్వార్టర్లను నిర్మించనుంది.
శిథిలావస్థకు చేరిన క్వార్టర్లు
సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో కార్మికుల కోసం 50 ఏళ్ల క్రితం టీవన్టైపు, డీ టైపు పేరుతో పైకప్పు సిమెంట్ రేకులతో క్వార్టర్లను నిర్మించింది. సింగిల్ బెడ్రూం, హాలు, కిచెన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పురాతన క్వార్టర్లు కార్మికులకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఐటీ ఇంజినీర్లు, పలు ప్రాంతాల్లో ఉన్నతస్థాయి విద్యను అభ్యసించిన కార్మికుల పిల్లలు ఇక్కడకు వస్తే ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఈక్రమంలో క్వార్టర్ పక్కనున్న స్థలంలో షెడ్డు, అదనపు నిర్మాణం చేపట్టినా ఏమూలకూ సరిపోవడం లేదు. గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ మేరకు సంస్థలో నూతన క్వార్టర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో పలు ఏరియాల్లో పాత క్వార్టర్లను తొలగించి వాటిస్థానంలో నూతనంగా క్వార్టర్లను నిర్మించేందుకు యాజమాన్యం నిర్ణయించింది.
ఆధునిక పద్ధతిలో విశాలంగా..
సింగరేణిలో అధికారులకు మిలీనియం ఏబ్లాక్ పద్ధతిలో 35 క్వార్టర్లు, మిలీనియం బీబ్లాక్ విధానంలో 108 క్వార్టర్లు ఖరారు చేసింది. ఉద్యోగులు, సూపర్వైజర్ క్యాడర్ కోసం మిలీనియం సీబ్లాక్ పద్ధతిలో 300 క్వార్టర్లు, వర్క్మెన్ల కోసం మిలీనియం డీబ్లాక్ 560 క్వార్టర్లు నిర్మించనున్నారు. గతంలో నిర్మించిన ఎండీటైపు క్వార్టర్ల మాదిరిగా ప్రతీ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. క్వార్టర్ల కోసం యాజమాన్యం టెండర్ ప్రక్రియ సిద్ధం చేసింది. త్వరలో టెండర్ల ద్వారా క్వార్టర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్కు కేటాయించనున్నారు.
ఆధునిక హంగులతో..
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, హంగులతో కార్మికులకు డబుల్ బెడ్రూం, అధికారులకు ట్రిపుల్ బెడ్రూంలు నిర్మించేందుకు నిర్ణయించాం. జీప్లస్ వన్ విధానంలో నిర్మాణాలు కొనసాగుతాయి. రూ.450కోట్లు వెచ్చించేందుకు బోర్డు అనుమతి లభించింది.
– ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి
ప్రాంతం అధికారులు కార్మికులు వ్యయం (రూ.కోట్లలో)
గోదావరిఖని 36 282 133
శ్రీరాంపూర్ 39 410 193
భూపాలపల్లి 22 60 45
మణుగూరు 46 108 79