
చెరువు నీటిని తరలిస్తే చర్యలు
పెగడపల్లి: చెరువులోని నీటిని అక్రంగా తరలిస్తే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. కాళేశ్వరం లింక్–2 కింద చేపట్టిన పైపులైన్ నిర్మాణ పనులు జరుగుతున్న స్థలం పక్కన ఉన్న జంగంకుంట చెరువులోని నీటితో పనులకు ఆటంకం కలుగుతుందని పనులు చేస్తున్న మెగా కంపెనీ వారు చెరువులోని నీటిని అక్రమంగా తరలిస్తున్నారని స్థానిక రైతులు గురువారం కలెక్టర్ సత్యప్రసాద్, పోలీస్స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం చెరువును స్థానిక రైతులు, అధికారులతో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు కేవలం రూ.7నుంచి 9 లక్షలు చెల్లించి రైతులకు ఆర్థికంగా నష్టం చేశారని, చొప్పదండి నియోజకవర్గంలో భూరిజిస్ట్రేషన్ విలువ పెంచి ఇదే ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.22 లక్షలు చెల్లించినట్లు గుర్తు చేశారు. లక్షల విలువ చేసే భూములను రైతులు త్యాగం చేయడం వల్లనే ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతున్న విషయాన్ని మరిచిపోకుండా పనులు జరపాలే తప్ప రైతులకు నష్టం చేసేలా వ్యవహరిస్తే ఊరుకునేంది లేదని హెచ్చరించారు. చెరువు ఆధారంగా సాగు చేసుకుంటున్న రైతులు ఆందోళన చెందొద్దని, అవసరమైన చెరువును నీటితో నింపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్ వెంట ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, ఇరిగేషన్ డీఈ నర్సింగారావు, తహసీల్దార్ రవీందర్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, భరత్రెడ్డి, పవన్రెడ్డి, రవి, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.