సిబ్బంది లేరు.. రసాయనాలు లేవు | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది లేరు.. రసాయనాలు లేవు

Jun 7 2025 12:18 AM | Updated on Jun 7 2025 12:18 AM

సిబ్బ

సిబ్బంది లేరు.. రసాయనాలు లేవు

● జిల్లాలో భూసార పరీక్షలకు మంగళం ● పరీక్షలు నిలిచిపోవడంతో రైతులకు అందని సేవలు

భూసార పరీక్షలు

జరగడం లేదు

జిల్లాలో భూసార పరీక్షలు జరగడం లేదు. భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటు చే సి సిబ్బందిని నియమించాలి.

– క్యాతం సాయిరెడ్డి,

సింగరావుపేట, రాయికల్‌(మం)

ప్రభుత్వానికి నివేదిక పంపించాం

జిల్లాలో భూసార పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిక పంపించాం. గతంలోని రెండు భూసార పరీక్షా కేంద్రాలు పనిచేయడం లేదు. ఎవరైన రైతులు మట్టి నమూనాలు తీసుకవస్తే, భూ సార పరీక్షా కోసం కరీంనగర్‌కు లేదా పొలాస వ్యవసాయ పరిశోధన స్థానానికి పంపిస్తున్నాం. త్వరలో మిని భూసార పరీక్షా కేంద్రాలను బలోపేతం చేస్తాం. – భాస్కర్‌, జిల్లా వ్యవసాయాధికారి

జగిత్యాలఅగ్రికల్చర్‌: పంటల సాగులో రైతులు విలువైన రసాయన ఎరువులను ఇష్టారాజ్యంగా వేస్తుండటంతో వ్యవసాయభూములు పనికి రాకుండా పోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. భూసార పరీక్షల అధారంగా రసాయన ఎరువులు వేస్తే, రైతులకు ఖర్చు తగ్గడమే కాకుండా భూములు చెడిపోవని, పర్యావరణం దెబ్బతినదని ప్రభుత్వం సూచిస్తోంది. అయితే, జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించే పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో మూడేళ్లుగా రైతులు భూసార పరీక్షలకు నోచుకోవడం లేదు.

జిల్లాలో భూసార పరీక్షా కేంద్రాలు లేనట్లే..

జిల్లాలో జగిత్యాల, మెట్‌పల్లిలో మార్కెట్‌యార్డులో భూసార పరీక్షా కేంద్రాలు ఉండేవి. పరీక్షా కేంద్రాలకు అవసరమైన రసాయనాల కోసం ఏడాదికి రూ.20–30 వేలు ఆయా మార్కెట్‌ యార్డుల నుంచి ఇచ్చేవారు. ఈ కేంద్రాల్లో పరీక్షలు చేసేందుకు వ్యవసాయాధికారులతో పాటు వ్యవసాయ సిబ్బంది ఉండేవారు. కాని, కొంతకాలంగా ఈ భూసార పరీక్షా కేంద్రాల్లో సిబ్బంది లేకపోవడంతో పాటు జగిత్యాలలోని భూసార పరీక్షా కేంద్రాన్ని సమీకృత మార్కెట్‌ నిర్మాణంలో భాగంగా కూల్చివేశారు. అలాగే, మెట్‌పల్లిలోని భూసార పరీక్షా కేంద్రం పత్తా లేకుండా పోయింది. దీంతో, భూసార పరీక్షలు నిలిచిపోవడంతో, రైతులకు అందించే సేవలు అందకుండా పోయాయి.

మినీ భూసార పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినా..

అగ్రికల్చర్‌ క్లస్టర్ల వారీగా ఏఈవోలను నియమించిన తర్వాత మినీ భూసార పరీక్షా కేంద్రాలను అయా క్లస్టర్లలో ఏర్పాటు చేశారు. రైతు వేదికలు కాక ముందు గ్రామ పంచాయతీ లేదా ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేసినప్పటికీ వాటితో పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీనికి తోడు మినీ భూసార పరీక్షా కేంద్రాలకు భూసార కిట్లు ఇచ్చినప్పటికీ అందులోని రసాయనాలు పనిచేయకపోవడంతో అవి సైతం మూలన పడ్డాయి. అయితే, గ్రామాల నుంచి రైతులు తీసుకవచ్చే మట్టి నమూనాలను కరీంనగర్‌కు పంపించేవారు. వాటి ఫలితాలు రైతులు పంటలు వేసిన తర్వాత ఎప్పుడో వచ్చేవి. అవి సైతం రైతులకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయాయి.

అవసరమైన రైతులు పొలాసకు..

ఉద్యాన పంటలను పెద్ద మొత్తంలో సాగు చేసే జిల్లా రైతులు మాత్రం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం లేదంటే పొలాస వ్యవసాయ కళాశాలకు తీసుకెళ్లి మట్టి పరీక్షలు చేయించుకుంటున్నా రు. చల్‌గల్‌ ఫాంలో భూసార పరీక్షా కేంద్రం ఉన్న ట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నప్పటికీ ఏ రైతుకు తెలియని పరిస్థితి ఉంది. పొలాస శాస్త్రవేత్తలు మాత్రం వారి నిబంధనల మేరకు కేవలం దత్తత గ్రామ రైతులకు ఉచితంగా పరీక్షలు చేస్తుండగా, మిగతా రైతులకు రూ.150 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో, చిన్న, సన్న కారు రైతులు కాకుండా కేవలం అవసరమైన రైతులు మాత్రమే భూసార పరీక్షలు చేయించుకుంటున్నారు.

సిబ్బంది లేరు.. రసాయనాలు లేవు1
1/2

సిబ్బంది లేరు.. రసాయనాలు లేవు

సిబ్బంది లేరు.. రసాయనాలు లేవు2
2/2

సిబ్బంది లేరు.. రసాయనాలు లేవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement