రాజానగరం: రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరు సైనికునిలా పనిచేసి పార్టీ విజయానికి పాటు పడాలని రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భారీ మెజార్టీని సాధించే దిశగా కార్యాచరణతో అడుగులు వేయాలన్నారు. రాజమహేంద్రవరంలోని సంహిత కన్వెన్షన్ హాలులో రాజానగరం నియోజవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల కమిటీ సభ్యులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికలలో అనుసరించవలసిన వ్యూహాలపై వారికి రాజా దిశనిర్దేశం చేశారు. స్థానికంగా ఉండే వర్గాలను పక్కన పెట్టి అందరూ సమష్టిగా పనిచేయాలన్నారు. గడచిన నాలుగున్నరేళ్లలో వైఎస్సార్సీపీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలను, పొందిన ప్రయోజనాలను ప్రతి ఇంటికీ వెళ్లి లబ్ధిదారులను కలుసుకుని వివరించాలన్నారు. ఎలాంటి వివక్షత చూపకుండా అన్ని వర్గాలకూ ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతోందన్నారు. అర్హత మాత్రమే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. ఎలాంటి రాజకీయ ప్రమేయాలకూ కూడా తావు లేదన్నారు. తెలుగు దేశం హయాంలో ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేశారన్నారు. రెండు ప్రభుత్వాల పనితీరును బేరీజు వేసుకుని జగనన్నకు మద్దతు పలకాలని ప్రజలకు సూచించాలని క్యాడర్కు చెప్పారు. పార్టీకి సంబంధించి సత్వరమే గ్రామకమిటీల నియామకాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. రానున్న ఎన్నికలకు ముందుగానే ప్రచారపర్వంలో అడుగు వేయాలన్నారు. కష్టపడిన ప్రతి ఒక్కరికీ పార్టీలో గుర్తింపు లభిస్తుందనే విషయాన్ని కార్యకర్తలు మరవరాదన్నారు. స్థానికంగా విజయం సాధించాలని, జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలనే గట్టి సంకల్పంతో పని చేయాలని జక్కంపూడి వైఎస్సార్ సీపీ శ్రేణులకు సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు కర్రి నాగేశ్వర్రావు, నాయకులు అనదాస సాయిరామ్, కొండపల్లి దుర్గారావు, కొండగుంటూరు రాయుడు, నాళం రోశయ్య, చాటమర్తి దుర్గారావు పాల్గొన్నారు.