పోలీసు వలలో కీచకుడు?
నిందితుడుపై తమిళనాడులో 35 కేసులు ఓ యువతిపై గ్యాంగ్రేప్ చేయడంతో వెలుగులోకి.. గుడిపాల, చిత్తూరు మండలాల యువకులు ఉన్నట్లు అనుమానం గిరిజన మహిళలే అతడి టార్గెట్
గుడిపాల : అతడి టార్గెట్ గిరిజన మహిళలే.. ముఠాతో కలిసి రావడం వారిపై గ్యాంగ్ రేప్ చేయడం అడ్డొచ్చిన వారిని బెదిరించి పారిపోవడం తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముఠా నేత అలెక్సా నైజం. గుడిపాల మండలంలోని గిరిజన ప్రాంతాలు ఉన్న గ్రామాలను ఎంచుకొని వారిని టార్గెట్ చేసి యువతులపై గ్యాంగ్రేప్ చేసి పారిపోయేవాడు. ఎట్టకేలకు పోలీసులకు దొరికినట్లు సమాచారం. కరుడుగట్టిన కీచకుడికి సంబంధించిన వివరాలు ఇలా..
గుడిపాల మండలంలో పేయనపల్లె, చీలాపల్లె, పల్లూరు, అనుపు ఎస్టీ కాలనీల్లో దందాలు నడిపేవాడు. రెండు రోజుల క్రితం అనుపు ఎస్టీ కాలనీకి సుమారు 15 మంది యువకులను తీసుకొచ్చి హల్చల్ చేశాడు. అక్కడి ఓ యువతిని గ్యాంగ్రేప్ చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో వారికి కత్తులు చూపించి బెదిరించాడు. ఇందులో ఓ యువకుడు ఎదురు తిరగ్గా అతన్ని తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. అలాగే పేయనపల్లె, పల్లూరు, చీలాపల్లె ఎస్టీ కాలనీల్లోని కొంతమంది యువతులపై కూడా గ్యాంగ్రేప్ చేసినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్ఐ రామ్మోహన్ రంగప్రవేశం చేసి కరుడుగట్టిన నిందితుడు అలెక్సాను వలపన్ని చీలాపల్లె సమీపంలో పట్టుకొని చిత్తూరుకు తరలించి విచారణ చేస్తున్నట్లు సమాచారం. అలెక్స్తో పాటు చిత్తపార గ్రామానికి చెందిన మల్లేష్(34) అనే అతను కూడా గ్యాంగ్రేప్ చేసినట్లు తెలియడంతో వారిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు.
గుడిపాలకు తమిళనాడు పోలీసులు
గుడిపాల మండలానికి తమిళనాడు సీఐడీ పోలీసులు వచ్చి పోలీస్స్టేషన్లో వాకబు చేసినట్లు సమాచారం. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైకి చెందిన అలెక్స్ వేలూరు జిల్లా కాట్పాడిలో నివాసం ఉంటున్నాడు. అతడి వృత్తి దొంగతనాలు, గ్యాంగ్రేప్లు, హత్యలు చేయడం వంటివి. విషయం తెలుసుకున్న తమిళనాడు సీఐడీ పోలీసులు గుడిపాల పోలీస్ స్టేషన్కు వచ్చారు. అతడిపై 35కి పైగా కేసులు ఉన్నట్లు గుడిపాల పోలీసులకు చూపించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంజినీరింగ్ కాలేజీలకు గంజాయి సరఫరా
తమిళనాడులోని కాట్పాడి ప్రాంతంలో ఇంజినీరింగ్ కాలేజీలు అధికంగా ఉన్నాయి. ఆ కాలేజీలకు కరుడుగట్టిన నిందితుడు అలెక్సా గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసినట్లు సమాచారం. ఇంకా ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడ్డాడు, హత్యలు ఎక్కడైనా చేశాడా అన్న కోణంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
గంజాయితో యువకులకు వల
అలెక్స్ అనే కరుడుగట్టిన నిందితుడు గుడిపాల మండలంలో కొంత మంది యువకులకు గంజాయి ఇచ్చి మచ్చిక చేసుకొనేవాడు. గుడిపాల మండలంలో మరకాలకుప్పం, గొల్లమడుగు, చిత్తపార, పల్లూరు, పేయనపల్లెకు సంబంధించి కొంత మంది యువకులను గంజాయిని ఉచితంగా ఇస్తుంటాడు. గ్యాంగ్రేప్లు, దొంగతనాలు చేసేటప్పుడు ఈ యువకులు అతనికి సహకరించేవారని సమాచారం. వీరందరూ ఎస్టీ గ్రామాలకు వెళ్లేప్పుడు మాస్క్లు ధరించుకొని అతడితో పాటు హల్ చల్ చేస్తుంటారని తెలుస్తోంది.
పోలీసు వలలో కీచకుడు?


