
నాటు బాంబు ఉండను తొక్కి వ్యక్తికి తీవ్రగాయాలు
బంగారుపాళెం: తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ చందాన తాను దాచిపెట్టిన నాటు బాంబు ఉండను తొక్కి వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని సోమవారం చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు, వెలుతురుచేను పంచాయతీ పులిమడుగు గ్రామానికి చెందిన బాలకృష్ణ కుమారుడు వినాయకం(35) తమిళనాడు నుంచి నాటు బాంబు ఉండలు తెప్పించి వాటితో అడవి జంతువులను చంపి వాటి మాంసాన్ని అమ్మేవాడు. ఈ క్రమంలో తన ఇంటి ఆవరణలోని మల్లెపూల చెట్టు పొదలో నాటు బాంబు ఉండలను దాచిపెట్టాడు. మల్లె పొద వద్ద కుక్క ఉండడంతో తరమడానికి పరుగెత్తాడు. ఈ క్రమంలో నాటు బాంబు ఉండపై కాలు వేయడంతో అది పేలి కుడిపాదం ఛిద్రమైంది. కుటుంబ సభ్యులు వినాయకంను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఇన్చార్జి వీఆర్ఓ హేమచంద్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కారు బైక్ ఢీ: ఒకరి దుర్మరణం
పులిచెర్ల(కల్లూరు): కారు బైక్ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసు ల కథనం మేరకు, చింతలవారిపల్లెకు చెందిన వెంకటస్వామి(62), నారాయణమ్మ(60) దంపతులు పూరేడివారిపల్లెలో ఉన్న అల్లుడు వాసు (40) ఇంటికి వచ్చారు. తిరిగి స్వగ్రామానికి అల్లుడు వాసుతో కలిసి ద్విచక్రవాహనంపై వీరు ముగ్గురూ బయల్దేరారు. మార్గమధ్యంలో పీలేరు రోడ్డులోని తాజ్ హోటల్ వద్ద తెలంగాణ నుంచి తిరువణ్ణామలైకి వెళుతున్న కారు ఈ బైక్ను ఢీకొంది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వెంకటస్వామి మృతి చెందారు. మరో ఇద్దరిని తమిళనాడులోని రాణిపేటలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కల్లూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
వెదురుకుప్పం: మండలంలోని పాతగుంటలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ వెంకటసుబ్బయ్య కథనం మేరకు, మండలంలోని ఏపేరి గ్రామానికి చెందిన నాగూర్ శెట్టి కుమారుడు ఎం.గోపి(25) పుట్టుకతో మూగవాడు. సొంత పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెదురుకుప్పం బయలుదేరాడు. మార్గమధ్యంలోని పాతగుంట గ్రామంలో పెనుమూరుకు వెళ్తున్న పుత్తూరు డిపోకు చెందిన బస్సు ఢీకొనడంతో గోపి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు మృత దేహాన్ని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారస్పీ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుని తల్లిదండ్రులు వైకల్యంతో అవస్థలు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఆస్తి వివాదంలో మహిళలపై దాడి
శాంతిపురం: మఠం పంచాయతీలోని వెంకటేష్పురంలో ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన మహిళలు, పిల్లలపై మరో వర్గం వారు దాడి చేసింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితురాలు పార్వతమ్మ రాళ్లబూదుగూరు పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు వివరాలు. గ్రామానికి చెందిన అనసూయమ్మ, ఆమె బావ నారాయణప్ప కుటుంబానికి గత దశాబ్ద కాలంగా ఆస్తి పంపకాల్లో వివాదం సాగుతోంది. ఈ నేపథ్యంలో గత నెల 31న అనసూయమ్మకు మద్దతుగా కావర్లపల్లి సల్లాపురి వర్గీయులు వచ్చి తనతో సహా మరో ఇద్దరు మహిళలు, తన మనుమరాళ్లైన ముగ్గురు బాలికలపై దాడి చేసి కొట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు రాళ్లబూదుగూరు ఎస్ఐ నరేష్ చెప్పారు.
రెండో రోజూ సర్వర్ మొరాయింపే!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వ్యాప్తంగా రెండు రోజు కూడా రేషన్ పంపిణీకి సర్వార్ మొరాయించింది. ఉదయం నుంచి రాత్రి వర సర్వర్ పని చేసినప్పుడల్లా కార్డుదారులకు రేషన్ ఇచ్చేందుకు డీలర్లు ముప్పుతిప్పలు పడ్డారు. బియ్యం సంచికి వచ్చేంత వరకు కార్డుదారులు పడిగావులు కాశారు. చాలా చోట్ల డీలర్లు వారి ఇష్టానుసారంగా రేషన్ దుకాణం తలుపులు తీశారు. 8 గంటలు పనివేళలు నామమాత్రంగానే కనిపించింది. నిరీక్షణతో కార్డుదారులు విసిగిపోయారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు అవస్థల నడుమ రేషన్ పట్టుకెళ్లారు. జిల్లాలో ఇప్పటి వరకు 37.58 శాతం పంపిణీ పూర్తయిందని డీఎస్ఓ శంకరన్ వెల్లడించారు.

నాటు బాంబు ఉండను తొక్కి వ్యక్తికి తీవ్రగాయాలు

నాటు బాంబు ఉండను తొక్కి వ్యక్తికి తీవ్రగాయాలు