చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లాలోని ముస్లింలకు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, భక్తికి ప్రతీక అయిన ఈ పవిత్రమైన రోజున అల్లాహ్ మీ ప్రార్థనలను అంగీకరించాలన్నారు. కుటుంబ సభ్యులకు శాంతి, సంతోషం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సుఖసంతోషాలతో జరుపుకోవాలి
చిత్తూరు అర్బన్: బక్రీద్ పండుగను ముస్లింలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎస్పీ మణికంఠ చందోలు ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ పండుగ జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చుని ఆయన సూచించారు.
డీఎస్సీ పరీక్షకు 103 మంది గైర్హాజరు
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించిన మొదటి రోజు డీఎస్సీ పరీక్షకు 103 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ మేరకు శుక్రవారం చిత్తూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రంలోని 8 పరీక్ష కేంద్రాల్లో తొలిరోజు డీఎస్సీ పరీక్షలను నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలను జరిపారు. ఈ పరీక్షలకు 8 పరీక్ష కేంద్రాల్లో 859 మంది అభ్యర్థులకు గాను 756 మంది హాజరయ్యారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణ తీరును పలువురు విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించారు.
రాహుకాల అభిషేకాలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మకు శుక్రవారం రాహుకాల అభిషేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధి చేశారు. రాహుకాల సమయంలో సంప్రదాయరీతిలో అర్చనలు, అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా బంగారు నగలు, రంగు రంగు పూలతో ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు, ఉచిత అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
రేపు కాణిపాకంలో సామూహిక అక్షరాభ్యాసం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఆదివారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించనున్నట్టు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని, అక్షరాభ్యాసానికి ఉచిత ప్రవేశామని తెలిపారు. చిన్న పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
నకిలీ యూట్యూబర్ హల్చల్
గంగవరం: పొలంలో చదును చేసుకుంటున్న రైతు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి తాను న్యూస్ యూట్యూబర్ అంటూ బెదిరించాడు. తనకు లంచం ఇవ్వాలంటూ రైతుతో వాగ్వాదానికి దిగాడు. తీరా ఆ రైతు తిరబడడంతో అతను కొంతసేపు రోడ్డుపై హల్చల్ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటన మండలంలో శుక్రువారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కీలపల్లి పంచాయతీ, బాలేపల్లి గ్రామానికి చెందిన రైతు బద్రినాథ్రెడ్డి గ్రామ సమీపంలోని హైవేలో ఉన్న సర్వే నం.407/1 లోని తన మూడెకరాల భూమిలో ముళ్ల పొదలను జేసీబీతో తొలగించి చదును చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఓ వ్యక్తి తాను యూట్యూబర్ అని, తనకు డబ్బు ఇవ్వకపోతే నీపై లేనిపోనివి యూట్యూబ్లో వేస్తానంటూ రైతును బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య కొంతసేపు వాదనలు జరిగాయి. అంతలో ఆ రైతు తన మొబైల్ ద్వారా వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. అంతవరకూ రోడ్డుపై హల్చల్ చేసిన నకిలీ యూట్యూబర్ అక్కడి నుంచి ఉడాయించాడు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 67,284 మంది స్వామి వారిని దర్శించుకోగా 31,268 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటల్లో దర్శనం లభిస్తోంది.

అల్లాహ్ అందరికీ అండగా ఉండాలి