
బోయకొండలో యోగాంధ్ర రేపు
చౌడేపల్లె: మండలంలోని బోయకొండ వద్ద సోమవారం తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పర్యటకశాఖాధికారిణి గౌరి, సీఐ రాంభూపాల్, తహసీల్దార్ హనుమంతునాయక్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యాటక ప్రాంతాల్లో ఇదివరకే పులిగుండు, కాణిపాకం వద్ద విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. సోమవారం ఉదయం 7 నుంచి 8 గంటల వరకు బోయకొండ వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామని, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ముమ్మరంగా ఏర్పాట్లు
యోగాంధ్ర నిర్వహణ ప్రదేశాన్ని వివిధ శాఖల అధికారులు సందర్శించారు. గోశాల వద్ద మట్టిని తోలి చదును చేసే పనులు చురుగ్గా చేపట్టారు.
సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్పై కేసు
చిత్తూరు అర్బన్: సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కే.చిన్నయ్య పై చిత్తూరు పోలీసులు శనివారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. సీఐ మహేశ్వర కథనం మేరకు... చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో చిన్నయ్య కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాడు. ఆ సమయంలో అందజేసిన పలు సర్టిఫికెట్లు తప్పుడువని, అలాగే హెల్త్ అసిస్టెంట్, శానిటరీ ఇన్స్పెక్టర్గా పదోన్నతులు పొందడానికి అందజేసిన ఇతర సర్టిఫికెట్లు తప్పుడువని .. ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఫిర్యాదు మేరకు చిన్నయ్యపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కాగా చిన్నయ్య చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి డిప్యూటేషన్ పై సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ నియమితులై పనిచేస్తున్నారు.
శ్రీవారి దర్శనానికి
20 గంటలు
తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి, క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 72,174 మంది స్వామివారిని దర్శించుకోగా 35,192 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీలో రూ.2.88 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.