
ప్రజలకు బాబు సృష్టించిన సంపద అప్పులే
– మాజీ డెప్యూటీ సీఎం ధ్వజం
పాలసముద్రం : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో ప్రజలకు సృష్టించిన సంపద అప్పులేనని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. శనివారం గంగమ్మంబపురం గ్రామంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో ఓ కళాశాలలో బీటెక్ విద్యార్థి జేమ్స్ అనే దళిత యువకుడిని కులం పేరుతో అదే కళాశాలలో చదివే జూనియర్ విద్యార్థి యశ్వంత్ నాయుడు, రౌడీషీటర్లతో కలసి కొట్టడమే కాకుండా మూత్రం పోసి తాగించారని గుర్తుచేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజలను నిలువునా ముంచేశారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలకు రెండింతలు ఇస్తామంటూ ఆయన చేసిన హడావుడిని ఎవరూ మరిచిపోయి ఉండరన్నారు. రాష్ట్రంలో 18 మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇసుక, మట్టి, మద్యం ఆదాయం ప్రభుత్వం నుంచి రాజకీయ నాయకుల జేబుల్లోకి పోతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని వేల మంది రోడ్డున పడ్డారని వాపోయారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కడుపు కోత మిగిల్చారని తెలిపారు. కూటమి ప్రభుతం ఏర్పడిన ఏడాదిలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రమే వచ్చిందని, అదే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒకే సారి రెండున్నర లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిదేనని గుర్తుచేశారు. కక్ష సాధింపులు మానుకుని రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు చందురాజు, కార్వేటినగరం మండల కన్వీనర్ శేఖర్రాజు, జెడ్పీటీసీ సభ్యుడు అన్బ్లగన్, సుందరరాజు, షణ్ముగరెడ్డి, కృష్ణయ్య, నరసింహ నాయుడు, గోపాల్, రవిరెడ్డి, చిన్నపయ్యన్, లక్ష్మణన్, తిరుమళ, గోపి, పయణి, బాబు, తిరుమాల్, కే.పయణి, కేశవన్, మణి, మనోహన్, వాసు, షణ్ముగరెడ్డి, సుబ్రమణ్యరాజు, చిన్నప్పరాజు పాల్గొన్నారు.