
● కలెక్టర్ చెప్పినా అమల్లోకిరాని గిట్టుబాటు ధర ● ఫ్యాక
చిత్తూరు అర్బన్: అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్టు తయారైంది జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి. కలెక్టర్ ఓ మాట, ఫ్యాక్టరీ యజమానులు మరో మాట.. రైతుల ఆవేదన ఇంకోలా ఉంది. మామిడికి కనీస ధరను నిర్ణయించి, దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. అధికారుల సమీక్షలు, రైతులతో సమావేశాలు, ఫ్యాక్టరీల నిర్వాహకులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ అరచేతిలో స్వర్గం అన్నట్లు అన్నదాతను మభ్యపెడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర జిల్లాలో ఏ ఒక్క ఫ్యాక్టరీ నిర్వాహకుడూ ఆమోదించడం లేదు. కలెక్టర్ ఎదుట తలాడించిన పల్ప్ ఫ్యాక్టరీ నిర్వాహకులు.. బయటకొచ్చి తమ బాధలు లక్ష ఉన్నాయని, వాటిని ఎవరు పట్టించుకుంటారని నిలదీస్తున్నారు.
కష్టాలు తప్పవా?
జిల్లాలో దాదాపు 50 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ఇందులో తోతాపురి (బెంగళూర) రకం 65 శాతం వరకు సాగవుతోంది. ఈ సీజన్కు 4లక్షల టన్నులకు పైగా తోతాపురి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ రైతులకు మాత్రం సగటున కిలోకు రూ.9 కంటే మించి గిట్టుబాటు ధర వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం.. మామిడి పల్ప్ తయారీ ఫ్యాక్టరీ నిర్వాహకులతో కూటమి ప్రభుత్వం చర్చలు జరపకపోవడమే. పక్కనున్న తమిళనాడులో కిలో రూ.4 ఉంటే.. తమకు ఆర్డర్లు ఇచ్చే ఎగుమతి దారులు, తమిళనాడుకు వెళుతున్నారనే తప్ప, ఇక్కడి ధరలకు ఆర్డర్లు రావడం లేదని ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు. అసలు ఇది వాస్తవమా..? కాదా..? అనే విషయాన్ని కలెక్టర్ నుంచి వ్యవసాయశాఖ అధికారుల వరకు ధృవీకరించి, క్షేత్రస్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. కానీ ఏ ఒక్కరూ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో రైతులకు ఈ దఫా కన్నీళ్లే మిగలనున్నాయి.
భారీ నిల్వలు కారణమే!
ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా జిల్లా నుంచి ఎగుమతి కావాల్సిన పల్ప్ భారీ మొత్తంలో స్తంభించిపోయింది. ఈ ఏడాది మార్చి వరకు 2.75 లక్షల టన్నుల పల్ప్ జిల్లాలోని ఫ్యాక్టరీల్లో నిలిచిపోయింది. పల్ప్ చెడిపోకుండా ఉండే కాలపరిమితి రెండేళ్లు. ఇప్పటికే ఓ ఏడాది అమ్ముడు కాలేదు. సరుకు చెడిపోవడానికి మరో ఏడాది కాలపరిమితే ఉండడంతో కిలో రూ.70 వరకు అమ్మాల్సిన పల్ప్ను, రూ.33కు విక్రయించినట్లు ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు. తమ వద్ద ఉన్న పల్ప్ను శ్రీవారి ఆలయంలో, కాణిపాకం, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాల్లో విక్రయించినట్లయితే గిట్టుబాటు ధర లభిస్తుందని చెబుతున్నారు. ఏడాదిగా ప్రభుత్వం పట్టిచుకోకుండా, ఇపుడు రైతులకు గిట్టబాటు ధర పేరిట డ్రామాలు ఆడడం వల్ల.. ఒత్తిడితో ఫ్యాక్టరీలను మూసివేసే పరిస్థితి వస్తోందని నిర్వాహకులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
తోతాపురి టన్ను రూ.12
చిత్తూరు కలెక్టరేట్ : తోతాపురి టన్ను రూ.12 వేలు నిర్ణయించామని, ఆ మేరకు పరిశ్రమల నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరను అమలు చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ గిట్టుబాటు ధర అమలులో తగు పర్యవేక్షణ అవసరమన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రాసెసింగ్ కంపెనీలకు మామిడి సరఫరా కాకుండా చెక్పోస్ట్ల వద్ద గట్టి నిఘా పెంచాలన్నారు.
పక్వానికి వచ్చిన కాయలనే కోయండి
జిల్లాలో మామిడి రైతులు పక్వానికి వచ్చిన కాయలను మాత్రమే కోసి ప్రొసెసింగ్ కంపెనీలకు తరలించాలని కలెక్టర్ తెలిపారు.

● కలెక్టర్ చెప్పినా అమల్లోకిరాని గిట్టుబాటు ధర ● ఫ్యాక