
ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయుడు
జూలూరుపాడు: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను పని చేసే పాఠశాలలోనే తన ఇద్దరు పిల్లలను చేర్పించి ఆదర్శంగా నిలిచాడు. జూలూరుపాడు జెడ్పీహెచ్ఎస్లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నండ్రు గురుమూర్తి పెద్ద కుమారుడు నిశాంత్ను ఇదే పాఠశాలలో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివించాడు. గతేడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నిశాంత్ 563 మార్కులు సాధించాడు. ఈ విద్యాసంవత్సరంలో ఆయన తన చిన్నకుమారుడు విశ్వసన్నిధ్ను 7వ తరగతిలో చేర్పించాడు. బుధవారం గురుమూర్తిని హెచ్ఎం లక్ష్మీనర్సయ్య, ఉపాధ్యాయులు అభినందించారు.
విత్తన లైసెన్స్ సస్పెన్షన్
సుజాతనగర్: అనుమతులు లేని ప్రదేశంలో విత్తనాలు విక్రయించిన సుజాతనగర్ మండల కేంద్రంలోని ఓ విత్తన దుకాణంపై వ్యవసాయాధికారులు చర్యలు తీసుకున్నారు. సుజాతనగర్లోని హేమంత్ కృష్ణ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణానికి చెందిన డీలర్ నిబంధనలకు విరుద్ధంగా చండ్రుగొండ మండలంలో ఇటీవల విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడ్డాడు. విచారణ అనంతరం దుకాణానికి సంబంధించిన విత్తన లైసెన్స్ను జిల్లా వ్యవసాయాధికారి సస్పెండ్ చేసినట్లు ఏఓ జి.నర్మద బుధవారం తెలిపారు.
బాలిక గర్భానికి కారణమైన బాలుడిపై పోక్సో కేసు
కామేపల్లి: పధ్నాలుగేళ్ల బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెబుతూ లోబర్చుకున్న పదిహేడేళ్ల బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు కామేపల్లి పోలీసులు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 9వ తరగతి చదువుతుండగా, మరో గ్రామానికి చెందిన బాలుడు ప్రేమ, పెళ్లి పేరిట మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆమెకు ఇటీవల కడుపునొప్పి రాగా కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పరీక్షించగా గర్భం దాల్చినట్లు తేలింది. కుటుంబీకుల ఫిర్యాదుతో బాలుడిపైనే కాక ఆయన స్నేహితుడిపై పోక్సో కేసు నమోదు చేసి బాలికను భరోసా కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
యువకుడిపై...
బోనకల్: మండలంలోని ఓ గ్రామంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.వెంకన్న తెలిపారు. మూడో తరగతి చదివే బాలికపై లక్ష్మీకాంత్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఏడుస్తూ వెళ్లి తల్లికి చెప్పగా ఆమె ఫిర్యాదుతో బుధవారం కేసు నమోదు చేశారు. కాగా, ఏసీపీ రెహమాన్ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు.
ప్రేమ పేరుతో
వేధిస్తున్న వ్యక్తిపై..
బోనకల్: ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న వ్యక్తిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి. వెంకన్న తెలిపారు. వైరాకు చెందిన ఆదూరి బాలు నాలుగేళ్లుగా కలకోటకు చెందిన యువతిని ప్రేమిస్తున్నాననంటూ వెంట పడడమే కాక ఆమెకు వస్తున్న పెళ్లి చెడగొడుతున్నాడు. దీంతో యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
పురుగులమందు తాగి యువకుడి ఆత్మహత్య
సింగరేణి(కొత్తగూడెం): పురుగులమందు తాగి యువకుడు మృతిచెందిన ఘటన బుధవారం రామవరంలో చోటుచేసుకుంది. కొత్తగూడెం ఏరియా పీవీకే–5 ఇంక్లైన్ గనిలో ఎల్లగొండ రఘు పనిచేస్తున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు. చిన్నవాడైన ఎల్లగొండ హేమసాగర్ (25) హైదరాబాద్లో క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం యువకుడు పురుగులమందు తాగాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన తల్లితండ్రులు హుటాహుటిన హైదరాబాద్ తరలివెళ్లారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హేమసాగర్ బుధవారం మృతి చెందాడు. కాగా, అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
హైవేపై వర్షపు నీరు
తల్లాడ: తల్లాడ రింగ్ సెంటర్లోని జాతీయ రహదారిపై వర్షం నీరు నిల్వ ఉండడంతో నేషనల్ హైవే అదికారులు బుధవారం పరిశీలించారు. వర్షం వచ్చినప్పుడుల్లా ఇదే పరిస్థితి ఎదురవుతుండగా.. నేషనల్ హైవే సైట్ ఇంజనీర్ జి.కిరణ్ తదితరులు పరిశీలించి వివరాలు ఆరా తీశారు. అయితే, రహదారిపై చెత్తాచెదారం పేరుకుపోవడమే సమస్యకు కారణమని, చెత్త తొలగిస్తే నీరు నిల్వ ఉండదని ఎంపీడీఓ సురేష్బాబు తెలిపారు. ఈమేరకు అవసరమైన మరమ్మతులు చేయిస్తామని అధికారులు వెల్లడించారు.

ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయుడు