
అధ్వానంగా అంతర్గత రోడ్లు
● కార్పొరేషన్తోపాటు మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి ● వీధుల్లో గుంతలమయంగా మారిన రహదారులు ● అన్నిచోట్లా వాహనదారులకు తప్పని అవస్థలు
నిర్మించిన ఎనిమిది నెలలకే
బీటలు వారిన గుడిపాడు సీసీ రోడ్డు
పురపాలికల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. గుంతలమయంగా తయారయ్యాయి. వర్షాలకు నీరు నిలిచి రోడ్లు ఇంకా పాడవుతున్నాయి. వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు వీధుల్లో వాహనాలు నడపాలంటే అవస్థ పడుతున్నారు. శివారు, విలీన ప్రాంతాల్లో కచ్చా రోడ్లు బురదమయంగా మారాయి. మిషన్ భగీరథ పైపులైన్ పనుల కోసం తవ్విన చోట సరిగ్గా పూడ్చకపోవడంతో గుంతలు ఏర్పడి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట పట్టణాల్లో రోడ్లు మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్నాయి.
అన్నీ గుంతలే..
మణుగూరు టౌన్: మున్సిపాలిటీలో విసిరేసినట్లుగా ఉండే కమలాపురంలో రోడ్డు గుంతలమయంగా మారింది. రాయిగూడెం వైపు నుంచి ఇసుక లారీలు భారీ లోడ్లతో వెళ్తుండటంతో రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయి. రోడ్లు బాగు చేసి డ్రెయిన్లు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధుల చెవికి ఎక్కడంలేదు. మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు మొత్తం సుమారు 40 కిలోమీటర్లు ఉండగా, కమలాపురంలోని సుమారు ఒక కిలోమీటరు బీటీ రోడ్డు నిర్మించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
బాగు చేయాలి
మణుగూరులో వానాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ గుంతలమయంగా మారతాయి. పాలకులు దృష్టి సారించి ఎప్పటికప్పుడు అంతర్గత రహదారులకు మరమ్మతులు చేపట్టాలి. మురుగు కాల్వలు నిర్మించాలి. – మునిగెల వీరమ్మ,
కమలాపురం గ్రామస్తురాలు
సీసీ రోడ్లకు బీటలు
పాల్వంచ: పాల్వంచ పట్టణంలో సీసీ రోడ్లు నాణ్యత లేకుండా నిర్మించడంతో బీటలువారి నిధులు దుర్వినియోగమయ్యాయి. వర్షాలకు ఆ రోడ్లు మరింత దెబ్బతింటున్నాయి. మిషన్ భగీరథ పైపులైన్ల కోసం ఇటీవల అనేక చోట్ల సీసీ రోడ్లను ధ్వంసం చేశారు. వాటిని సరిచేసేందుకు నెలల తరబడి పనులు చేపడుతున్నారు. ఒడ్డుగూడెం రోడ్లో పైపులైన్ల లీకేజీలతోపాటు, కొత్త కనెక్షన్ల కోసం మట్టి తీసి, సీసీ రోడ్లు తవ్వారు. గుడిపాడు వెళ్లే దారిలో 8 నెలల క్రితం సీసీ రోడ్డు నిర్మించారు. మార్కెట్ ఏరియాలో నూతనంగా రోడ్డు వేశారు. ఇవి బీటలు వారుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడంతో బీటలు వారి గతుకులమయంగా తయారవుతున్నాయి.
ఎనిమిది నెలలకే బీటలు
పట్టణంలోని శివారు ప్రాంతం గుడిపాడుకు ఎనిమిది నెలల క్రితం సీసీ రోడ్డు నిర్మించారు. నాణ్యత లేకుండా పనులు చేపట్టడంతో రహదారి బీటలు వారింది. ఎన్నో సంవత్సరాలు ఉండాల్సిన రోడ్డు దుస్థితి ఇప్పటికే దెబ్బతింది. అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది.
–ఆరెం ప్రశాంత్, గుడిపాడు

అధ్వానంగా అంతర్గత రోడ్లు

అధ్వానంగా అంతర్గత రోడ్లు

అధ్వానంగా అంతర్గత రోడ్లు

అధ్వానంగా అంతర్గత రోడ్లు

అధ్వానంగా అంతర్గత రోడ్లు