
భూసమస్యల పరిష్కారానికే సదస్సులు
కలెక్టర్ జితేష్ వి పాటిల్
కొత్తగూడెంఅర్బన్ : భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, సమస్యలు ఉన్నవారు సదస్సుల్లో దరఖాస్తు అందజేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలకలో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూములు తదితర సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు. వాటి పరిశీలనకు భూ భారతి చట్ట ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతారని, నిర్దేశిత గడువు లోగా సమస్యలు పరిష్కరిస్తారని వివరించారు. ఆర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తహసీల్దార్ను అదేశించారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీఓ మధు తదితరులు పాల్గొన్నారు.
జయరాజు స్ఫూర్తి ఆదర్శం..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి జయరాజు అందించిన స్ఫూర్తి ముందు తరాలకు ఆదర్శమని కలెక్టర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జయరాజును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రకృతి పరిరక్షణకు జయరాజుతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కొత్తగూడెం ప్రకృతి అశ్రమ సభ్యులు రాజేంద్రప్రసాద్, సుగుణారావు, నాగ సీతారాములు, వెంకటముత్యం, సురేష్, వరలక్ష్మి, మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ తనిఖీ..
కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ బుధవారం తనిఖీ చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. గోడౌన్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేకుండా ఎవరినీ లోనికి రానీయొద్దని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎన్నికల సూపరింటెండెంట్లు ఎండీ.ముజాహిద్, రంగాప్రసాద్, ఆయా పార్టీల నాయకులు నోముల రమేష్, లక్ష్మణ్ అగర్వాల్, రాంబాబు తదితరులు ఉన్నారు.