
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
డివిజన్ల ప్రక్రియ
ఎప్పుడో..?
అశ్వారావుపేట: నూతనంగా ఏర్పాటైన అశ్వారావుపేట మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన కొత్తగూడెంలో డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ రెండో చోట్లా మంగళవారమే డివిజన్ల కేటాయింపు జరగాల్సి ఉంది. అయితే కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు అశ్వారావుపేట మున్సిపాలిటీకి కమిషనర్గా సుజాత ఒక్కరే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆమె ఏ మున్సిపాలిటీలోనూ అందుబాటులో ఉండరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని మున్సిపాలిటీల్లో వార్డుల ఏర్పాటు, సవరణ జాబితాను మంగళవారం ప్రకటించాలి. దీనిపై అభ్యంతరాల స్వీకరణ, విచారణ పూర్తయ్యాక తుది జాబితా విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా మొదటి రోజు ప్రక్రియే చేపట్టలేదు. పాలనాపరమైన అంశాల్లో కార్యాలయ సిబ్బంది సైతం జోక్యం చేసుకోలేని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. అశ్వారావుపేట మున్సిపాలిటీలో గుర్రాలచెరువు, పేరాయిగూడెం, పూర్వ అశ్వారావుపేట గ్రామపంచాయతీలు ఉండగా ఏ వార్డు ఎక్కడ మొదలవుతుంది.. ఎక్కడ ముగుస్తుంది.. ఇలా 23 వార్డుల సమగ్ర సమాచారం కోసం పట్టణ వాసులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై కమిషనర్ సుజాతను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులో లేరు.
14 మంది మైనింగ్ అధికారుల బదిలీ
సింగరేణి(కొత్తగూడెం) : సింగరేణిలో వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న 14 మంది మైనింగ్ (సేఫ్టీ) అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఐదుగురు డిప్యూటీ జీఎంలు, ఒక కాలరీ మేనేజర్, ముగ్గురు అడిషినల్ మేనేజర్లు, ఇద్దరు ఎస్ఈలు, ఇద్దరు సీనియర్ అండర్ మేనేజర్ స్థాయి అధికారులు ఉన్నారు. కాగా, వీరంతా ఈనెల 14వ తేదీన కేటాయించిన ఏరియాల్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచించారు.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం