
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు
టేకులపల్లి: విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయాల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు స్పష్టం చేశారు. మండలంలోని విత్తన, ఎరువులు, పురుగు మందుల దుకాణాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆమోదిత విత్తనాలను, నిర్దేశించిన ధరల్లో మాత్రమే విక్రయించాలని చెప్పారు. యూరియా అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
బీజేపీ ఆధ్వర్యంలో శోభాయాత్ర
చుంచుపల్లి: బీజేపీ ఆధ్వర్యంలో రాణి అహల్యాబాయి జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అహల్యాబాయి 300 ఏళ్ల క్రితమే మహిళా సాధికారతకు కృషి చేశారని అన్నారు. నాయకులు జీవికే మనోహర్, రంగాకిరణ్, జల్లారపు శ్రీను, గూడ విజయ, పైడిపాటి రవీందర్, కుంజా ధర్మ, తిమ్మిరి నరేంద్రబాబు, శీలం విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
నిజాయితీ చాటిన రైతు
సుజాతనగర్: జొన్నలు కొనుగోలు చేసిన వ్యాపారి అదనంగా డబ్బులు చెల్లించగా, ఆ సొమ్ము తిరిగి చెల్లించి ఓ రైతు తన నిజాయితీని చాటుకున్నాడు. నర్సింహసాగర్ గ్రామానికి చెందిన బానోత్ భీముడు 50 కిలోల జొన్నలను విక్రయించేందుకు డేగలమడుగులోని మన్నెపల్లి రాణి ఇంటికి వెళ్లాడు. కిలో ధాన్యం రూ.50 చొప్పున విక్రయించాడు. కాగా రైతుకు రూ. 2500 ఇవ్వాల్సి ఉండగా రూ.20,500 వ్యాపారి రైతుకు ఇచ్చింది. రైతు ఇంటికి వెళ్లి చూసుకోగా రూ.18 వేలు అదనంగా ఉండటంతో ఆ సొమ్మును తిరిగి వ్యాపారికి వద్దకు వచ్చి ఇచ్చివేశాడు.
కామారెడ్డి రైతులకు ‘ఆయిల్పామ్’పై అవగాహన
అశ్వారావుపేటరూరల్/దమ్మపేట: కామారెడ్డి జిల్లా రైతులు శనివారం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని ఆయిల్ పామ్ తోటలను సందర్శించారు. సుమారు 150 మంది రైతులు నారంవారిగూడెం వద్దగల ఆయిల్ఫెడ్ పామాయిల్ మొక్కల నర్సరీ, దమ్మపేట మండలంలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీతోపాటు ఆయిల్పామ్ సాగు క్షేత్రాలను పరిశీలించారు. తోటల పెంపకం, సాగు పద్ధతులు, దిగుబడి తదితర వివరాలు స్థానిక రైతులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ సంస్థ మేనేజర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
క్వాలిటీ కంట్రోల్ కమిటీ పరిశీలన
భద్రాచలంటౌన్: పట్టణంలోని మదర్ థెరిస్సా డిగ్రీ కళాశాలలో కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ ఎన్ఏఏసీ క్వాలిటీ కంట్రోల్ విభాగం బృందం సభ్యులు శనివారం సందర్శించారు. బోధనా ప్రమాణాలు తదతర అంశాలపై ఆరా తీశారు. ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంపొందిస్తూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ కమిటీ డైరెక్టర్ వెంకటరమణ, కరస్పాండెంట్ ప్రభాకర్ పాల్గొన్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు