
ఇసుక తవ్వకాలపై సొసైటీ సభ్యుల ఆగ్రహం
చర్ల: మండలంలోని కొయ్యూరు గ్రామ పంచాయతీలో సొసైటీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఇసుక తవ్వకాలను చేపట్టారు. దీంతో సొసైటీ సభ్యులు శనివారం నిరసన తెలిపారు. ఇసుక తవ్వకాలు చేపట్టిన ప్రాంతానికి చేరుకుని పనులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సమాచారం ఇవ్వకుండా తవ్వకాలు ఎందుకు చేపట్టారని ప్రశ్నిస్తే తమపై దాడి చేశారంటూ సుందరయ్యకాలనీ, చీమలపాడుకు చెందిన గిరిజనులు ఆరోపించారు. సొసైటీలోని సభ్యులందరికీ సమాచారం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ సొసైటీలో కొందరు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇసుకను కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇసుకను మాన్యువల్ పద్ధతిలో తీయాల్సి ఉన్నప్పటికీ భారీ యంత్రాల ద్వారా తీస్తూ తమ పొట్ట కొడుతున్నారని, దీనిని తక్షణమే నిలిపివేయించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.