
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశాం
● వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతం ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మహేందర్
సూపర్బజార్(కొత్తగూడెం): వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా అమలు చేశామని ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి.మహేందర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వివరాలు వెల్లడించారు. గతేడాది నవంబర్ నుంచి వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేయడంతో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలిగామన్నారు. లోడ్ పెరిగే అవకాశం ఉన్న గుండాల మండలంలోని మామకన్ను, గుండాల, ఆళ్లపల్లి మండలంలోని ఆళ్లపల్లి, చర్ల మండలం సత్యనారాయణపురంలలో నూతన పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని, దీంతో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా నివారించామని చెప్పారు. ఇప్పటివరకు 309 నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని, 58 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం కూడా పెంచామని వివరించారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, బూర్గంపాడు, సారపాక, మణుగూరు, అశ్వారావుపేట, దమ్మపేట, చుంచుపల్లి, సుజాతనగర్, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, టేకులపల్లి, బొమ్మనపల్లి, లక్ష్మీదేవిపల్లి, జూలూరుపాడులలో ఓవర్లోడ్ తగ్గించామని తెలిపారు.
అంతరాయాలను నివారించగలిగాం
గతంలో 33/11 కేవీ సబ్స్టేషన్లలో ఒకే వీసీబీపై రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉండేవని, దీనివల్ల ఒక ఫీడర్లో అంతరాయం ఏర్పడితే మిగతా ఫీడర్లలో కూడా అంతరాయం కలిగేదని అన్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బే ఎక్స్టెన్షన్/ప్రత్యేక వీసీబీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలను తగ్గించామన్నారు. ఓల్టేజీలో హెచ్చుతగ్గులు లేకుండా క్షేత్రస్థాయిలో 45–600 కెపాసిటర్ బ్యాంకులు, 33/11 కేవీ సబ్స్టేషన్లలో 8–1 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేశామని వివరించారు. ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుని వేసవికి సమాయత్తం కావడంతో అంతరాయం లేకుండా మెరుగైన విద్యుత్ సరఫరా చేశామని, ప్రతీ ఉద్యోగి నిబద్ధతతో పనిచేయడం వల్ల ఇది సాధ్యమైందని ఎస్ఈ తెలిపారు.
పోల్ ట్యాక్స్ చెల్లించాలి
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ నిర్వాహకులు పోల్ ట్యాక్స్ సక్రమంగా చెల్లించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ మహేందర్ సూచించారు. భద్రాచలం విద్యుత్ శాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన వైర్లు గజిబిజిగా ఉన్నాయని, సమస్య ఏర్పడినప్పుడు విద్యుత్ స్తంభాలు ఎక్కాలంటే కేబుల్ వైర్లతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. రానున్న వర్షాకాలంలో వేగంగా వీచే గాలుల వల్ల విద్యుత్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, ఆపరేటర్లు వైర్లను సరిచేసుకోవాలని చెప్పారు. డీఈ జీవన్ కుమార్, ఏడీఈ వేణు, ఏఈలు రాజారావు, ఉపేందర్ పాల్గొన్నారు.