
‘కగార్’ పేరుతో ప్రభుత్వ హత్యలు..
గుండాల: ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసీలను హత్య చేయడాన్ని నిలిపివేయడమే కాక అన్ని ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అరుణోదయ చైర్మన్ విమలక్క డిమాండ్ చేశారు. అంతేకాక కాల్పుల విరమణ పాటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలన్నారు. గుండాలలో అఖిల భారత రైతు కూలీ సంఘం, ఆల్ ఇండియా కేత్ మజ్దూర్ కిసాన్ సభ, రైతు కూలీ సంఘం ఆధ్వర్యాన ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ శుక్రవారం ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ మధ్య భారతంలోని అడవుల్లో ఉన్న విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేలా, ఆదివాసీలను అడవుల్లో నుంచి తరిమివేసేందుకే కగార్ పేరిట మానవ హననానికి పూనుకున్నారని ఆరోపించారు. మే 31నాటికి మావోయిస్టులను తుద ముట్టిస్తామని కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా కాల్పుల విరమణను మావోయిస్టులు ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం స్వాగతించకుండా వేలాది సైనిక బలగాలను అడవుల్లోకి పంపి మావోయిస్టు నాయకులతో పాటు అమాయక ఆదివాసీలను కాల్చి చంపుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే మావోయిస్టు కీలక నేత నంబాల కేశవరావు సహా 26 మందిని హత్య చేసి, మృతదేహాలు కూడా ఇవ్వకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. కేశవరావు మృతితో పాటు 2024 నుండి ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ప్రసాద్, ఊక్లానాయక్, నాగిరెడ్డి, వెల్తురు సదానందం, కోడెం వెంకటేశ్వర్లు, కందకట్ట సురేందర్, సోమన్న, బొమ్మర రాంబాబు, వి.చంద్రయ్య, మోకాళ్ల సమ్మయ్య, యుగంధర్, పల్స యాదగిరి, ఆరెల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అరుణోదయ చైర్మన్ విమలక్క