వస్తుందో.. రాదో..? | - | Sakshi
Sakshi News home page

వస్తుందో.. రాదో..?

May 30 2025 12:15 AM | Updated on May 30 2025 12:15 AM

వస్తు

వస్తుందో.. రాదో..?

రాజీవ్‌ యువ వికాసంపై గందరగోళం
● సిబిల్‌ స్కోర్‌ నిబంధనతో దరఖాస్తుదారుల ఆందోళన ● మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న పథకం

కొత్తగూడెంఅర్బన్‌: రాజీవ్‌ యువ వికాసం పథకం రుణం వస్తుందో? రాదోనని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పలువురు యువతీ యువకులు ఆయా మున్సిపాలిటీలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత అధికారులు, సిబ్బంది పరిశీలించి అన్ని ధ్రువపత్రాలు ఉన్న దరఖాస్తులను బ్యాంకులకు పంపించారు. బ్యాంకర్లు దరఖాస్తుదారుడి సిబిల్‌ స్కోర్‌, గతంలో ఉన్న బ్యాంకు రుణాలు, చెల్లింపులు, చెక్‌బౌన్స్‌, ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న రుణానికి మళ్లీ నగదు చెల్లించగలడా? అనే విషయాలు పరిశీలించి అర్హుల జాబితాలను మండల, పట్టణ అధికారులతోపాటు ఎంపిక కమిటీలకు పంపిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత అధికారులు, కమిటీ సభ్యులు ఇంటర్వ్యూ నిర్వహించి, కులాల వారీగా ఆయా కార్పొరేషన్లకు పంపించనున్నారు. అనంతరం ప్రభుత్వ సైట్‌లో అప్‌లోడ్‌ చేసి సబ్సిడీ కోసం పంపించాల్సి ఉంటుంది.

సబ్సిడీ ఇలా..

రాజీవ్‌ యువ వికాసం పథకం జూన్‌ 2 నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన దరఖాస్తుదారులకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణం ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో రూ.50 వేలు రుణం తీసుకున్న వారు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు తీసుకున్న వారికి 80 శాతం సబ్సిడీ, 20 శాతం బ్యాంకు రుణం ఇస్తారు. రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు తీసుకుంటే 70 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు రుణం ఇస్తారు. గతంలో దరఖాస్తుదారుడు బ్యాంకు రుణం తిరిగి చెల్లిస్తాడో లేదోననే అనుమానంతో సబ్సిడీ పోగా మిగిలిన మొత్తాన్ని బ్యాంకర్లు ముందే డిపాజిట్‌ చేయించుకునేవారు. ఇప్పుడు సిబిల్‌ స్కోర్‌, ఇతర పరిశీలన అంతా బ్యాంకర్లకు అప్పగించడం సరికాదని దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు.

రాజకీయ పార్టీల నుంచి మరో జాబితా...

రాజీవ్‌ యువ వికాసం పథకానికి సంబంధించి పట్టణ, మండలాధికారులు, కమిటీలు తర్జనభర్జనలు పడుతూ దరఖాస్తుల పరిశీలన చేసి బ్యాంకులకు పంపిస్తుంటే, కొందరు దరఖాస్తుదారులు రాజకీయ పార్టీ నాయకులను ఆశ్రయిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు వేర్వేరుగా దరఖాస్తుదారుల నుంచి ఒక జిరాక్స్‌ సెట్‌ సేకరిస్తున్నారు. ప్రస్తుతం రాజీవ్‌యువ వికాసం దరఖాస్తులు అన్నీ కూడా బ్యాంకులకు చేరాయి. వాటిలో అర్హత కలిగిన వారి జాబితాను ప్రభుత్వం తిరిగి బ్యాంకులకు పంపిస్తుందని బ్యాంకర్లు చెబుతున్నారు. కార్పొరేషన్‌ అధికారులు మాత్రం బ్యాంకు నుంచి బయటకు వచ్చిన జాబితాలోని వారికి పట్టణ, మండల కమిటీలు ఇంటర్వ్యూలు చేపట్టి అర్హులను ఎంపిక చేస్తారని చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారులు గందరగోళంలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్‌కు 9747, బీసీ కార్పొరేషన్‌కు 20602, మైనారిటీ కార్పొరేషన్‌కు 9800 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

సిబిల్‌తో సంబంధం లేకుండా..

రాజీవ్‌ యువ వికాసానికి సంబంధించి కొత్త నిబంధనలు రద్దు చేయాలి. సిబిల్‌ స్కోర్‌ పరిగణనలోకి తీసుకోకుండా రుణం మంజూరు చేయాలి. సబ్సిడీ పోను 20, 30 శాతం వాటాను బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసేందుకు దరఖాస్తుదారులు సిద్ధంగా ఉన్నారు. –హరి, కొత్తగూడెం

గడువుకు ముందే పని చేయలే..

రాజీవ్‌ యువ వికాసం సైట్‌ కేటాయించిన గడువుకు వారం ముందు నుంచే పని చేయలేదు. దీని వలన దరఖాస్తు చేసుకోలేకపోయాను. ప్రభుత్వం మళ్లీ దరఖాస్తులకు వెసులుబాటు కల్పించాలి. అర్హులందరికీ రుణం అందించాలి.

–శ్రీనివాస్‌, కొత్తగూడెం

వస్తుందో.. రాదో..?1
1/2

వస్తుందో.. రాదో..?

వస్తుందో.. రాదో..?2
2/2

వస్తుందో.. రాదో..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement