సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసీ వెల్ఫేర్ ఆఫీసర్గా కసనబోయిన శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈమేరకు యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వులను గురువారం జీఎం శాలేంరాజు అందించారు. సింగరేణి గతేడాది ఇంటర్నల్ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్మెంట్ ట్రెయినీ(వెల్ఫేర్ ఆఫీసర్)లుగా పలువురిని ఎంపిక చేయగా కొందరికే పోస్టింగ్ ఇచ్చింది. మిగతా వారు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి. దీంతో ఐదుగురికి పదోన్నతి కల్పించగా అందులో శ్రీనివాస్ ఉన్నారు. అలాగే, కె.కల్యాణ్ రాజ్కుమార్ను ఆర్జీఓసీ–2కు, ఏ.మధును అడ్రియాలకు, సిరిమల్లె అశోక్ను ఇల్లెందు కేఓసీకి, దాసరి నాగరాజును జీడీకే 2, 2ఏకు కేటాయించారు.
కార్పొరేట్ సివిల్ హెచ్ఓడీగా వెంకటేశ్వర్లు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో సివిల్ హెచ్ఓడీగా ధనసరి వెంకటేశ్వర్లును నియమిస్తూ యాజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం జీఎంగా విధులు నిర్వర్తిస్తున్న టి. సూర్యనారాయణ ఈ నెల 31 ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మణుగూరు సివిల్ ఏజీఎం వెంకటేశ్వర్లును నియమించారు.
ఏఎస్పీ బాధ్యతల స్వీకరణ
కొత్తగూడెంఅర్బన్: జిల్లా అడిషనల్ ఎస్పీ(ఆపరేషన్స్)గా గోపతి నరేందర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. కరీంనగర్ టాస్క్ఫోర్స్ ఏసీపీగా పని చేస్తున్న ఆయన జిల్లాకు పదోన్నతిపై అడిషనల్ ఎస్పీగా బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన నరేందర్ను పలువురు అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
గురుకులంలో డిగ్రీకి దరఖాస్తుల ఆహ్వానం
అశ్వాపురం: మండల పరిధిలోని మిట్టగూడెంలోని గిరిజన గురుకుల బాలుర డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపాల్ బండారుపల్లి రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ, బీకామ్, బీఏ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఐటీ హబ్లో 2నుంచి నైపుణ్య శిక్షణ
ఖమ్మం అర్బన్: ఖమ్మంలోని ఐటీ హబ్లో వచ్చేనెల 2వ తేదీ నుంచి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యాన నైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో కోరారు. జావా ఫండమెంటల్, జావా ప్రోగ్రామింగ్, పైథాన్ డేటాబేస్, క్లౌడ్ కంప్యూటింగ్, టాలీ జీఎస్టీ, ఐటీ స్కిల్స్ తదితర కోర్సుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందుకోసం రూ.599 రిజిస్టేషన్ ఫీజు చెల్లిస్తే ఆరు నెలల వ్యవధిలో అభ్యర్థులకు అనుకూలమైన సమయంలో శిక్షణకు హాజరుకావొచ్చని వెల్లడించారు. పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం 95025 05880 నంబర్లో సంప్రదించాలని వారు ఓ ప్రకటనలో సూచించారు.
తెలంగాణ ఉద్యమకారుడు ఆశీర్వాదం మృతి
తల్లాడ: తల్లాడ మండలం పినపాకకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మోదుగు ఆశీర్వాదం(69) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. యాభై ఏళ్ల క్రితం కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించిన ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. కొన్నాళ్లు కాంగ్రెస్లో కొనసాగగా, 2001లో టీఆర్ఎస్లో చేరి మలిదశ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించారు.
బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మధిర నియోజకవర్గ ఇన్చార్జ్గానూ పనిచేసిన ఆశీర్వాదం తల్లాడలో కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, ఆశీర్వాదం మృతదేహం వద్ద మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నివాళులర్పించారు. అలాగే, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్తో పాటు వజ్రాల రామిరెడ్డి, కోడూరి వీరకృష్ణ, బద్దం కోటిరెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, కాంపాటి జమలయ్య, జీవీఆర్, వివిధ పార్టీల నాయకులు సైతం నివాళులర్పించి ఆశీర్వాదం కుటుంబీకులను పరామర్శించారు.

కిష్టారం ఓసీ వెల్ఫేర్ ఆఫీసర్గా శ్రీనివాస్

గోపతి నరేందర్