
బొగ్గు టిప్పర్ దగ్ధం
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : మండలంలోని పెద్దిరెడ్డిగూడెం పంచాయతీ శాంతినగర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం బొగ్గు టిప్పర్ కేబిన్లో మంటలు చెలరేగి దగ్ధమైంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సత్తుపల్లి సింగరేణి ఓపెన్కాస్టు నుంచి బొగ్గు లోడ్తో వచ్చిన టిప్పర్ కొత్తగూడెంలో అన్లోడ్ చేసి తిరిగి వెళ్తోంది. ఈ క్రమంలో టిప్పర్ కేబిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ వాహనం నిలిపి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సత్తుపల్లి నుంచి ఫైరింజ్తో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.
కస్తూరి జింక అవశేషాల ఘటనపై
కేసు నమోదు
అశ్వారావుపేటరూరల్: కస్తూరి జింక అవశేషాల ఘటనలో ఇద్దరిపై గురువారం అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. అశ్వారావుపేట ఫారెస్టు రేంజర్ మురళి కథనం ప్రకారం.. మండలంలోని వినాయకపురం గ్రామానికి చెందిన ఎస్కే అబ్దుల్ హఫీజ్ ఇంట్లో ఉన్న బ్యాగుల్లో కస్తూరి జింకలకు సంబంధించి బంతి ఆకారంలో ఉన్న 13 అవశేషాలు ఉన్నట్లు అనుమానంతో అతని భార్య ఆనీశ్ఫాతిమా ఈ నెల 26న ఫిర్యాదు చేయగా, అధికారులు ఇంట్లో సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. కాగా, ఈ ఘటనలో అబ్దుల్ హఫీజ్తోపాటు మండలంలోని తిరుమలకుంట గ్రామానికి చెందిన పామర్తి మధుపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కస్తూరి జింక అవశేషాలుగా భావిస్తున్న వాటిని హైదరాబాద్లోని సీసీఎంబీ ల్యాబ్కు పంపించామని, నిర్ధారణ కావాల్సి ఉందని రేంజర్ తెలిపారు.
మనస్తాపంతో వృద్ధుడి ఆత్మహత్య
అశ్వారావుపేటరూరల్: వృద్ధుడి ఆత్మహత్య ఘటనలో గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని రమణక్కపేట గ్రామానికి చెందిన జల్లి నర్సయ్య(55) కుమార్తె భద్రమ్మకు ఐదేళ్ల క్రితం వివాహం కాగా, ఈ నెల 27న విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. విందులో నర్సయ్య అతిగా మద్యం తాగి వాగ్వాదం పెట్టుకోవడంతో కుల పెద్దలు మద్యం తాగొద్దని మందలించారు. దీంతో మనస్తాపం చెంది అదే రోజు ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు ప్రసాద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.