
విద్యుత్ ఉద్యోగుల నిరసన
పాల్వంచ/మణుగూరు రూరల్: ఉత్తర ప్రదేశ్లో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయీస్(టీజీపీఈ) జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గురువారం పాల్వంచ కేటీపీఎస్, మణుగూరులోని బీటీపీఎస్ల ఎదుట భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న నాయకులపై కేసులు బనాయిస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ సంస్థల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలని, ఉత్తర ప్రదేశ్ కార్మికులకు అందరూ అండగా నిలవాలని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ అసిస్టెంట్ ఇంజనీర్ల అసోసియేషన్ నాయకులు రవిప్రసాద్, రవితేజ, వివిధ కార్మిక సంఘాల నాయకులు బ్రహ్మాజీ, యాస్మీన్, రాజేందర్, రాధాకృష్ణ, వెంపటి వెంకటేశ్వర్లు, నరసింహారావు, సాయిరాం, వి.ప్రసాద్, బి.కృష్ణ, వెంకట్రామ్, వీరస్వామి, ఆర్.రామచందర్, సిద్దెల హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.