
జిల్లాకు రిక్తహస్తమే..!
పేరుకే నిధులు..
భద్రాచలం రోడ్ మీదుగా సర్వే నిర్వహించిన రైల్వే లైన్లలో ఒకటైన కొండపల్లి – కొత్తగూడెం (125 కి.మీ) రైల్వేలైన్ నిర్మాణ అంచనా వ్యయం రూ.997 కోట్లు కాగా ప్రస్తుత బడ్జెట్లో కేవలం రూ.10 లక్షలు కేటాయించారు. డోర్నకల్ నుంచి భద్రాచలంరోడ్ వరకు ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్ను డబ్లింగ్ చేసేందుకు రూ.770 కోట్లు అవసరం అవుతుండగా ఈ బడ్జెట్లో కేటాయింపులేమీ చూపలేదు. అయితే సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలో పోచారం, గాంధీపురం రైల్వే సేష్టన్ల అభివృద్ధికి దాదాపు రూ.50 కోట్ల నిధులు కేటాయించారు.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: 2025 – 26 రైల్వేబడ్జెట్లో జిల్లాకు మొండిచేయే ఎదురైంది. గత మార్చిలో బడ్జెట్ ప్రకటించగా కేటాయింపులకు సంబంధించిన పింక్బుక్ వివరాలు ఇటీవల వెల్లడయ్యాయి. ప్రతీ ప్రాజెక్టుకు అంచనా వ్యయం రూ.కోట్లలో ఉంటే కేటాయింపులు మాత్రం రూ.లక్షలకే పరిమితమయ్యాయి.
నామ్కే వాస్తే నిధులు..
భద్రాచలంరోడ్ – కొవ్వూరు రైల్వే లైన్ నిడివి 151 కి.మీ. ఈ మార్గంలో రైల్వేలైన్ నిర్మించాలని మూడు దశాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ప్రస్తుత బడ్జెట్లో ఆమోదం లభించినా నిధుల కేటాయింపు అంతంతగానే మారింది. ఈ మార్గంలో ట్రాక్ నిర్మాణానికి రూ.1,444 కోట్లు అవసరం కాగా ఈ బడ్జెట్లో కేవలం రూ. 95 లక్షలు కేటాయించారు. ఈ లైన్తో పాటు కొత్తగా భద్రాచలం (పాండురంగాపురం) – మల్కన్గిరి, కిరండోల్ – కొత్తగూడెం, మణుగూరు – రామగుండం రైల్వే లైన్ల నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన రైల్వే శాఖ.. ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ మార్గాలకు కూడా ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయిస్తారనే ఆశలు అడియాశలే అయ్యాయి.
మణుగూరుకు మొండిచేయి..
మణుగూరు – రామగుండం రైల్వే లైన్ నిడివి 200 కి.మీ. కాగా నిర్మాణ వ్యయం రూ.2,911 కోట్లుగా అంచనా వేశారు. ఈ లైన్కు ప్రస్తుత బడ్జెట్లో కంటి తుడుపు చర్యగా కేవలం రూ.73 లక్షలు కేటాయించారు. రామగుండం సమీపంలోని రాఘవాపురం వద్ద మొదలయ్యే ఈ రైలు మార్గం మంథని – భూపాలపల్లి – మేడారం – తాడ్వాయి – రామానుజపురం మీదుగా మణుగూరు వరకు నిర్మించాల్సి ఉంది. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ ట్రాక్ నిర్మాణానికి భూ సేకరణ ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది. దీంతో ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు జరుగుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రాజెక్టుకూ రిక్తహస్తమే ఎదురైంది.
రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో మొండిచేయి
అంచనాలు రూ.కోట్లలో.. కేటాయింపులు రూ.లక్షల్లో
మణుగూరు – రామగుండం లైన్పై శీతకన్ను
పత్తాలేని మల్కన్గిరి – కిరండోల్ మార్గాలు
కొవ్వూరు, కొండపల్లి లైన్లకూ అరకొర విదిలింపులే..
కొత్త రైల్వే లైన్ నిర్మాణ వ్యయం బడ్జెట్ కేటాయింపులు
భద్రాచలంరోడ్– కొవ్వూరు రూ.1,444 కోట్లు రూ. 95 లక్షలు
కొత్తగూడెం – కొండపల్లి రూ. 997 కోట్లు రూ.10 లక్షలు
మణుగూరు – రామగుండం రూ. 2,911 కోట్లు రూ.73 లక్షలు
భద్రాచలంరోడ్ – డోర్నకల్ రూ. 770 కోట్లు కేటాయింపుల్లేవు
(డబ్లింగ్)