మీలో ఉందా.. ఆలోచనా శక్తి! | - | Sakshi
Sakshi News home page

మీలో ఉందా.. ఆలోచనా శక్తి!

Jun 30 2025 4:08 AM | Updated on Jun 30 2025 4:08 AM

మీలో

మీలో ఉందా.. ఆలోచనా శక్తి!

మదనపల్లె సిటీ: విద్యార్థుల్లో, ఆలోచన శక్తిని పెంపొందించి పరిశోధనల వైపు ఆసక్తిని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఇన్‌స్పైర్‌మనాక్‌ అవార్డుల పేరుతో ప్రోత్సహిస్తుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ , డిపార్టుమెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వారు చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రస్తుత విద్యా సంవత్సరం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా 6 నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థుల నుంచి లక్ష ప్రాజెక్టులను ఎంపిక చేసి ఒక్కోదానికి రూ.10 వేల చొప్పున అందజేసి ప్రోత్సహిస్తుంది. విద్యాశాఖ పరిధిలోని అన్ని యజమాన్యాలు, ప్రభుత్వం, ప్రైవేట్‌, కస్తూర్బాగాంధీ, మోడల్‌ స్కూల్స్‌, అన్ని పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. ఇన్‌స్పైర్‌ అవార్డులు పొందిన విద్యార్థులు జిల్లా, రాష్ట్ర ,జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 2025–26 ఇన్‌స్పైర్‌ మనాక్‌ అవార్డుల ప్రదర్శనకు ప్రకటన జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపించేందుకు సెప్టెంబర్‌ 15 వరకు గడువు ఇచ్చింది.

ఏటా ప్రతిష్టాత్మకంగా....

కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఏటా ఇన్‌స్పైర్‌ మనాక్‌ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ,రాష్ట్ర సాంకేతిక మండలి సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం ఈ సరికొత్త వేదికను రూపొందించారు. దీనిలో అన్ని ప్రభుత్వ అనుబంధ విద్యా సంస్థల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి పాల్గొనే అవకాశం కల్పించింది. జిల్లాలో 304 ఉన్నత, 162 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. దీని కోసం 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు తరగతికి ఒకరు వంతున పాఠశాలకు ఐదు ప్రాజెక్టులను నమోదు చేసుకునే అవకాశం ఉంది. 2008–09 నుంచి ఏటా నిర్వహించే ఇన్‌స్పైర్‌ మనాక్‌ పోటీలకు ప్రభుత్వ, ప్రైవేటు మేనేజ్‌మెంట్ల పాఠశాలల నుంచి ప్రాజెక్టులను ఆహ్వానిస్తున్నారు.

వెబ్‌సైట్‌లో నమోదు ఇలా..

విద్యార్థులు వెబ్‌సైట్‌ www.inspireaawards. gov.inలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. జిల్లా అథారిటీ ఆమోదం తర్వాత విద్యార్థి మెయిల్‌ ఐడీకి యూజర్‌ ఐడీతో కూడిన లింకు వస్తుంది. యూజర్‌ ఐడీకి పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకోవాలి.విద్యార్థి తన సమాచారంతో పాటు బ్యాంకు లేదా తపాలా ఖాతా, ఆధార్‌ నంబర్లను నమోదు చేయాలి. ఎంచుకున్న ప్రాజెక్టును సంక్షిత్తంగా వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. అవార్డుకు ఎంపికై న ప్రతి విద్యార్థి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వీలుగా రూ.10 వేల పారితోషికం అందిస్తారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటి జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న బాల శాస్త్రవేత్తలకు రూ.25 వేల వరకు తమ ప్రాజెక్టును మెరుగుపర్చుకునేందుకు శాస్త్ర సాంకేతిక శాఖ అదనపు నిధులు కేటాయిస్తుంది. ఇన్‌స్పైర్‌ మనాక్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్‌ ,జపాన్‌ సందర్శన అవకాశాలతో పాటు ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. జాతీయ స్థాయిలో ఎంపికై న ప్రాజెక్టుకు పేటెంట్‌ లభించే అవకాశం కూడా ఉంది. పూర్తి వివరాలకు జిల్లా సైన్సు అధికారులను సంప్రదించాలి.

ప్రోత్సహించాలి

విద్యార్థులలో పరిశోధనలపై ఆసక్తిని పెంచడానికి,పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి ఇన్‌స్పైర్‌ మానక్‌ అవార్డులు మంచి అవకాశం. ఆసక్తి ఉన్న విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ప్రాజెక్టులు తయారు చేయించాలి. –మార్ల ఓబుల్‌రెడ్డి,

జిల్లా సైన్సు అధికారి

చక్కని అవకాశం

విద్యార్థులు తమలోని సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించేందుకు ఇన్‌స్పైర్‌ మనాక్‌ ఒక చక్కని అవకాశం. ఈ పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలి. జిల్లా నుంచి అధికంగా నామినేషన్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌లో గొప్ప శాస్త్రవేత్తలను కలుసుకునే అవకాశం లభిస్తుంది. –సుబ్రమణ్యం, డిఈఓ

తొలుత పాఠశాల స్థాయిలో ఐడియా కాంపిటేషన్‌ నిర్వహించాలి. స్థానిక సమస్యను పరిష్కరించేలా ఐడియా ఉండాలి. తరగతి వారీగా ఉత్తమ ఆలోచనను ఎంపిక చేసి, ఆలోచనకు అవసరమైన ప్రాజెక్టును రూపొందించాలి. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి వివవరాలు నమోదు చేయాలి. విద్యార్థికి సంబంధించి బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్‌ నంబర్‌, ఎంటర్‌ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా, రాత పూర్వకంగా పొందుపర్చి,సంబంధిత రైటప్‌ వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతను సంబంధించి అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టుల ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లా స్థాయిలో ప్రకటిస్తారు. తర్వాత వాటిని రాష్ట్ర స్థాయికి ఎంపికకు పంపిస్తారు. ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం బ్యాంకు ఖాతాలో రూ.10 వేలు జమ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్‌ 15 తేదీ వరకు గడువు ఉంది.

దరఖాస్తు చేసుకునే విధానం

ఇన్‌స్పైర్‌ మనాక్‌ నామినేషన్ల నమోదుకు శ్రీకారం

సెప్టెంబర్‌ 15 వరకు గడువు

మీలో ఉందా.. ఆలోచనా శక్తి! 1
1/3

మీలో ఉందా.. ఆలోచనా శక్తి!

మీలో ఉందా.. ఆలోచనా శక్తి! 2
2/3

మీలో ఉందా.. ఆలోచనా శక్తి!

మీలో ఉందా.. ఆలోచనా శక్తి! 3
3/3

మీలో ఉందా.. ఆలోచనా శక్తి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement