
టీడీపీలో కలవరం!
సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది. పార్టీ అధిష్ఠానం టీడీపీలో గట్టి పట్టున్న వారిని పట్టించుకోకపోవడం, నియోజకవర్గ ఇన్ఛార్జిలనుప్రకటించకపోవడం, ప్రస్తుత సర్కార్లో అవినీతి కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నా మిన్నకుండిపోతుండడం వంటి ఘటనలతో పార్టీలో సీనియర్ నాయకులు మనస్థాపం చెందుతున్నారు. ఎప్పటినుంచో పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేసిన వారికి కాకుండా అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వారికి టీడీపీ అధిష్ఠానం పదవులు కట్టబెడుతుండడంపై కూడా పార్టీలోని సీనియర్ నాయకులు రగలిపోతున్నారు. ప్రధానంగా జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను టీడీపీ కరివేపాకులా వాడుకుని వదిలేసిందన్నది మెజార్టీ ప్రజల నుంచి అభి ప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపధ్యంలోనే ఎన్ని అవమానాలకు గురిచేసినా పార్టీని అంటిపెట్టుకుని పనిచేసిన మాజీ జెడ్పీ చైర్మన్, టీడీపీ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎంపీ దివంగత సుగవాసి పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడు సుగవాసి బాలసుబ్రమణ్యంను పార్టీ అధిష్టానం అవమానాలకు గురి చేయడంతో తిరుగుబాటు బావుటా ఎగురవేసి టీడీపీకి రాజీనామా చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీడీపీలో కలవరం మొదలైంది.
రాజంపేట నుంచి పోటీ చేసినా...
ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రమణ్యం పోటీ చేశారు. పాలకొండ్రాయుడు కుటుంబం నుంచి రాయచోటికి అవకాశం పరిశీలించాలని పదేపదే అడిగినా కాదని, రాజంపేట నియోజకవర్గం అప్పగించారు. అయినా బాలసుబ్రమణ్యం వెనుకంజ వేయకుండా రాజంపేట టీడీపీ టిక్కెట్పై పోటీ చేశారు. ఏరు దాటకముందు ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా.. టీడీపీ అధిష్టానం వ్యవహరించడంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నికల తర్వాత ఓడిపోయిన అభ్యర్థికి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఇన్ఛార్జి పదవిని కట్టబెట్టకుండా నాన్చుడు ధోరణితో ముందుకు వెళ్లింది. అంతవరకు బాగానే ఉన్నా మరోపక్క ఇంకో నాయకుడిని అదే నియోజకవర్గంలో ప్రోత్సహించడం వెనుక పొమ్మనకుండానే పొగబెట్టినట్లు అర్థమవుతోంది.
వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన సుగవాసి బాలసుబ్రమణ్యం
అన్నమయ్య జిల్లాలో ఇదే బాటలో మరికొందరు