
హైస్కూల్ ప్లస్ అట్టర్ప్లాప్!
మదనపల్లె సిటీ: గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్యను అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓ బృహత్తర లక్ష్యంతో ఉన్నత పాఠశాలకు అనుబంధంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో హైస్కూల్ ప్లస్ను ప్రారంభించింది.పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువుకు దూరం కాకూడదన్న కారణంగా జిల్లాలో మదనపల్లె, చిట్వేలి, గాలివీడు, టి.సుండుపల్లి మండలాల్లో హైస్కూల్ ప్లస్ ప్రారంభించింది. అందులో ఉచితంగా ఇంటర్మీడియట్ను ప్రారంభించి, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులను ప్రవేశపెట్టింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయా హైస్కూల్ ప్లస్లను గాలికొదిలేసింది. నిర్వహణ పట్టించుకోలేదు. కనీసం అధ్యాపకులను కూడా నియమించలేదు. పాఠాలు చెప్పేవారే లేకుండానే నేడు హైస్కూల్ ప్లస్లు ప్రారంభంకానున్నాయి. హైస్కూల్ ప్లస్లో చేరడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నా అధ్యాపకులు నియామకం జరగకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. గత ఏడాది కూడా అధ్యాపకుల నియమించకపోవడంతో ఆయా పాఠశాల్లోని ఉపాధ్యాయులే విద్యాబోధన చేశారు. దీంతో ఫలితాలు కూడా అంతంత మాత్రమే వచ్చాయి. కొన్ని చోట్లయితే సున్నా శాతం ఫలితాలు వచ్చాయి. ఈ ఏడాదైనా పాఠశాలలు తెరిచిన వెంటనే అధ్యాపకులును నియమిస్తే ఫలితాలొస్తాయి. ఇదిలా ఉండగా హైస్కూల్ ప్లస్ పాఠశాల్లో చదివే విద్యార్థులకు జీవశాస్త్రం, భౌతిక,రసాయన శాస్త్రాలకు సంబంధించి తరగతి గదులు,ల్యాబ్లు, తదితర మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. అధ్యాపకులను కూడా నియమించలేదు. ఈ పాఠశాలల్లో విద్యార్థులు చేరడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ విద్యా సంవత్సరమైన పాఠశాలలు పునః ప్రారంభం సందర్భంగా అధ్యాపకులను నియమించి ల్యాబ్, మౌళిక వసతులు ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు ఆశించవచ్చని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు కరువు
టీచర్లు లేకుండానే విద్యా సంవత్సరం ప్రారంభం
అధ్యాపకులను నియమించాలి
హైస్కూల్ ప్లస్లలో విద్యార్థుల సౌకర్యం కోసం అధ్యాపకులను నియమించాలి. సకాలంలో యూనిఫాం,పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందజేయాలి. గత ప్రభుత్వం ఉన్నతాశయంతో ప్రారంభించిన హైస్కూల్ ప్లస్లను బలోపేతం చేయాలి.
–మాధవ్,ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి