
‘మోదీ మెప్పు కోసమే యోగాంధ్ర ప్రచార ఆర్భాటం’
దేవరాపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసమే రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర పేరిట ప్రచార ఆర్భాటం చేస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న విమర్శించారు. ఈ మేరకు దేవరాపల్లిలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. యోగాతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి అధికార యంత్రాంగాన్ని యోగా కోసం వినియోగించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే మోదీ సభకు లక్షల మందిని విశాఖకు తరలించడం ప్రజాధనం వృథా తప్పా, రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. రైతులు, శ్రామికులు, ఉపాధి కూలీలలతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు.