సాక్షి, విశాఖపట్నం: పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కూటమి ప్రభుత్వం కుట్ర చేసి.. స్టేడియం ఆధునికీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారం, ముఖభాగం(ఫసాడ్)పై వైఎస్సార్ పేరు తొలగించినందుకు వ్యతిరేకంగా గురువారం వైఎస్సార్ సీపీ శాంతియుతంగా నిరసన తెలిపింది. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో మేయర్ గొలగాని హరివెంకటకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు తొలుత స్టేడియం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నల్ల రిబ్బన్లతో ఆందోళన చేశారు. వైఎస్సార్ పేరును యథావిధిగా పెట్టాలని నినాదాలు చేశారు.
48 గంటల్లో సమాధానం చెప్పాలి :
ఏసీఏకు అమర్నాథ్ డిమాండ్
విశాఖలో ఈ నెల 24, 30 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో.. విశాఖ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలనే ఉద్దేశంతో పాటు క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా శాంతియుతంగా నిరసన తెలిపినట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కూటమి పార్టీల ఎంపీలు ఏసీఏలో సభ్యులుగా ఉండడంతోనే కుట్రపూరితంగా స్టేడియం ప్రవేశ ద్వారం, ఫసాడ్పై వైఎస్సార్ పేరు తొలగించారని మండిపడ్డారు. 2009 సెప్టెంబర్ 14న అప్పటి ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగారాజు ఆధ్వర్యంలో ఏసీఏ–వీడీసీఏ స్టేడియాన్ని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంగా మార్చినట్లు గుర్తు చేశారు. అప్పుడు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ మార్క్, బ్రాండ్ కనబడకూడదనే కుట్రతోనే మహానేత పేరును తొలగిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన సీతకొండ వ్యూ పాయింట్కు వైఎస్సార్ పేరు పెడితే దాన్ని తొలగించారని మండిపడ్డారు. విశాఖ ఫిలింనగర్ క్లబ్ లాన్కు వైఎస్సార్ పేరు తొలగించారని, ఇవే కాకుండా ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక చోట్ల వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేశారన్నారు. వైఎస్సార్ పేరును ఏసీఏ తొలగించిందా? లేదంటే కూటమి ప్రభుత్వం ఒత్తిడితో తొలగించారా? 48 గంటల్లో సమాధానం చెప్పాలని ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ను అమర్నాథ్ డిమాండ్ చేశారు. నిరసనలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, అన్నంరెడ్డి అదీప్రాజ్, కె.భాగ్యలక్ష్మి, శోభా హైమావతి, నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్లవరపు జాన్వెస్లీ, పేర్ల విజయచంద్ర, పార్టీ ముఖ్య నాయకులు రొంగలి జగన్నాఽథం, కొండా రాజీవ్గాంధీ, మొల్లి అప్పారావు, వుడా రవి, జహీర్ అహ్మద్, గండి రవి, శోభాస్వాతి రాణి, కార్పొరేటర్లు రెయ్యి వెంకట రమణ, అక్కరమాని పద్మరాము నాయుడు, డౌలపల్లి ఏడుకొండలరావు, కోరుకోడ వెంకట రత్న స్వాతి దాస్, పద్మా రెడ్డి, బిపిన్ కుమార్ జైన్, కె.వి.శశికళ, గుడివాడ అనూష, ఇమ్రాన్, జిల్లా కార్యవర్గం కమిటీ, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు బోని బంగారు నాయుడు, నడింపల్లి కృష్ణంరాజు, చెన్నా జానకీరామ్, మువ్వల సురేష్, ద్రోణంరాజు శ్రీవాస్తవ్, బింగి హరి కిరణ్ రెడ్డి, పల్లా దుర్గారావు, మనలత జాబ్దాస్ (చిన్ని), పేడాడ రమణి కుమారి, వంకాయల మారుతీ ప్రసాద్, పీలా కిరణ్ జగదీష్, రామారెడ్డి, రాయపు అనిల్ కుమార్, లావణ్య చిమట, శెట్టి రోహిణి, పిల్లి సుజాత, పిల్లా సుజాత, అల్లంపల్లి రాజబాబు, మాధవీవర్మ, మజ్జి వెంకట రావు, బంకు సత్య, పోలిరెడ్డి, శ్రీదేవి వర్మ, రాజేశ్వరి, సూరిబాబు పాల్గొన్నారు.
క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్ సీపీ ధర్నా
యథావిధిగా పేరు పెట్టాలని డిమాండ్
ముఖ్య నాయకులకుబెదిరింపు ఫోన్లు
అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్ సీపీ ఆందోళన చేపడుతుందని ఈ నెల 19న పిలుపునిచ్చిన మరుక్షణం నుంచి కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది. బుధవారం అర్ధరాత్రి నుంచే వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లకు పోలీసులు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. నిరసన కార్యక్రమానికి ఎవరినైనా తీసుకెళ్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు వైఎస్సార్ సీపీ ముఖ్య నేతల ఇళ్లకు వెళ్లి పోలీసులు వార్నింగ్లు ఇచ్చారు.