
రైతులకు కొబ్బరి మొక్కలు అందజేస్తున్న సబ్ కలెక్టర్ శుభం బన్సల్, లలితాకామేశ్వరి
● ఉత్పాదకలో రాష్ట్రం ప్రథమస్థానం ● ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కుమార్ వేల్
రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతం కొబ్బరి సాగుకు ఎంతో అనుకూలంగా ఉందని కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కుమార్ వేల్ అన్నారు. పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం నిర్వహించిన ప్రపంచ కొబ్బరి దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్, కేవీకే కోఆర్డినేటర్ డా. లలితాకామేశ్వరి, అంబాజీపేట హెచ్ఆర్ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్టు ఎన్బీవీ చలపతిరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ కుమార్ వేల్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొబ్బరి ఉత్పాదక ఎక్కువగా ఉన్నప్పటికీ విస్తీర్ణం తక్కువగా ఉందన్నారు. ఏజెన్సీలో కొబ్బరి సాగును ప్రోత్సహించేందుకు తొలిసారిగా కేవీకేలో ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహించినట్టు చెప్పారు. ఏజెన్సీలో కొబ్బరి సాగు విస్తీర్ణం పెంచేందుకు గిరిజనుల్లో చైతన్యం తెచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. దేశంలో కొబ్బరి విస్తీర్ణంలో మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో హెక్టార్కు 16 వేల కొబ్బరి కాయలు ఉత్పాదకత ఉండగా, తమిళనాడులో 11 వేలు మాత్రమే ఉందన్నారు. రానున్న రోజుల్లో ఐటీడీఏ, ఉద్యానవనశాఖ, కేవీకేలతో కలిసి ఏజెన్సీలో కొబ్బరి సాగును ప్రోత్సహించేందుకు పనిచేస్తామన్నారు. సబ్ కలెక్టర్ శుభం బన్సల్ మాట్లాడుతూ ఏజెన్సీలో కొబ్బరి అభివృద్ధి సంస్థతో కలిసి పనిచేయడం ద్వారా గిరిజనుల అభివృద్ధికి సహకరిస్తామన్నారు. కొబ్బరిలో తెగుళ్ల నివారణ, విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. రెండేసి కొబ్బరి మొక్కలు చొప్పున 375 మంది రైతులకు అందజేశారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు ద్వారా రైతులకు అందించే రాయితీలు వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ఎస్ శాస్త్రవేత్తలు డా. రాజేంద్రప్రసాద్, వీసీ వెంగయ్య, కేవీకే శాస్త్రవేత్తలు డా. వీరాంజనేయులు, క్రాంతికుమార్, ప్రవీణ్, పీహెచ్వో చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కొబ్బరి బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కుమార్ వేల్