
ఇక సినిమా థియేటర్!
ఎలా చూడగలరు..?ఎవరు చూడగలరు..
ఇందుకోసం.. ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్ ఉండాలి. రూ.199 నుంచి ఈ కనెక్షన్ అందుబాటులో ఉంది. కొత్త సినిమాని ఫైబర్ నెట్లో రిలీజ్ చెయ్యాలని ప్రభుత్వంతో నిర్మాతలు ముందుగానే ఒప్పందం చేసుకుంటారు. ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందన్నది ముందుగానే ప్రకటిస్తారు. సినిమా చూడాలనుకున్న వినియోగదారులు.. రూ.99తో ఏపీఎస్ఎఫ్ఎల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అంతే ఆ సినిమా లింక్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వినియోగదారుడికి పంపిస్తారు. ఒకే టికెట్తో ఇంటిల్లపాదీ రిలీజ్ సినిమాని ఫస్ట్ డే రోజున.. ఫస్ట్ షోని ఇంట్లోనే చూసుకోవచ్చు. ఈ లింక్ 24 గంటల పాటు యాక్టివేట్గా ఉంటుంది. అంటే.. 24 గంటల సమయంలో ఎన్నిసార్లైనా ఈ సినిమా చూసుకోవచ్చు.
సాక్షి, విశాఖపట్నం : అరెరె.. మంచి సినిమా రిలీజైంది. ఏ థియేటర్లోనూ టికెట్స్ దొరకడం లేదు.. ఫ్యామిలీతో సినిమా ప్లాన్ చేశాను. కానీ.. నా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిందే.. ఈ అనుభవం సినిమా అభిమానులందరికీ చాలాసార్లు ఎదురయ్యే ఉంటుంది. ఇకపై మీ ప్లాన్లు ఫ్లాప్ అవ్వవు. ఎందుకంటే.. ఫ్యామిలీ మొత్తం.. ఒకే టికెట్పై రిలీజ్ సినిమాని ఇంటి దగ్గర నుంచే ఎంచక్కా చూసెయ్యవచ్చు. అదీ 99 రూపాయలకు మాత్రమే.. అది కూడా 24 గంటల సేపు.. ఆ సినిమాని ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు చూసుకోవచ్చు కూడా..నిజమండీ.. రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ డే.. ఫస్ట్ షో పేరిట ఈ అవకాశం కల్పిస్తోంది. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్(ఏపీఎస్ఎఫ్ఎల్) ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఏమిటీ.. ఫస్ట్ డే ఫస్ట్ షో..?
కోవిడ్ తర్వాత సినీ పరిశ్రమ కుదేలైంది. థియేటర్లకు వెళ్లేందుకు జనం భయపడేవారు. క్రమంగా పరిస్థితులు చక్కబడ్డాయి. థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఓటీటీ ప్లాట్ఫారాలు కూడా అదే రీతిలో దూసుకొచ్చాయి. ఓటీటీల కోసమే కొన్ని సినిమాలు తీస్తూ థియేటర్లో కాకుండా ఈ ప్లాట్ఫారాలు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఓటీటీ హవా నడుస్తోంది. ప్రజలు థియేటర్కు వెళ్లే కంటే ఇంటిలోనే సినిమా చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఇదే బాటలో ఫైబర్ నెట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటీటీలకు భిన్నంగా ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రారంభమైంది. ఓటీటీ ప్లాట్ఫారంలో రిలీజ్ అయిన సినిమాలు థియేటర్లో కనిపించవు. కానీ ఫస్ట్ డే.. ఫస్ట్ షోలో మాత్రం.. థియేటర్లోనూ, ఇటు ఇంటిలోనూ ఒకేసారి రిలీజ్ అవుతాయి. సినీ ప్రముఖులతో చర్చలు జరిపి ఈ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది.
నిర్మాతలకు లాభమేనా.??
తెలుగులో ఏటా పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతుంటాయి. ఒక పెద్ద హీరో సినిమా లేదా.. పెద్ద బ్యానర్ సినిమా రిలీజ్ అయితే, చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా మారింది. థియేటర్లు ఖాళీ అయ్యేంత వరకూ చిన్న సినిమాలు ఈ సమయంలో థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేని వారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సినిమాలు చూసేందుకు తీసుకొచ్చిందే ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్. ఏపీ ఫైబర్ నెట్ తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్ ద్వారా చిన్న సినిమా నిర్మాతలకు ఊతంలా ఉంటుంది. నిర్మాతలకు ప్రమోషనల్ ఖర్చులు తగ్గుతాయి. ఇందులో వచ్చే ఆదాయాన్ని ఫైబర్ నెట్, నిర్మాతలు పంచుకుంటారు. ఉదాహరణకు రాష్ట్రంలోని 660 మండలాల్లోని 950 ప్రాంతాల్లో ఏపీ ఫైబర్ నెట్ వినియోగదారులు 8 లక్షల మంది ఉన్నారు. వీరిలో కనీసం లక్షల మంది ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూసేందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటే.. దాదాపు రూ.కోటి వస్తుంది. ఈ మొత్తాన్ని ఫైబర్ నెట్, నిర్మాతలు షేర్ చేసుకుంటారు. తద్వారా చిన్న సినిమా నిర్మాతలు కూడా లాభపడి మరిన్ని విభిన్నమైన సినిమాలు వచ్చే అవకాశాలున్నాయి.
తొలి సినిమా నిరీక్షణ...
ఫస్ట్ డే.. ఫస్ట్ షో కాన్సెప్ట్ ద్వారా ప్రజల ఇంటికి చేరువైన తొలి సినిమా నిరీక్షణ.. టేక్ ఓకే క్రియేషన్స్ బ్యానర్పై ఉత్తరాంధ్రకు చెందిన వంశీకృష్ణ దర్శకత్వంలో సాయిరోనక్ హీరోగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
ఫ్యామిలితో కలిసి మొదటి రోజు
మొదటి ఆట చూసే అవకాశం
దేశంలో తొలిసారిగా ప్రారంభించిన
ఏపీ ప్రభుత్వం
ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఇంట్లోనే
రిలీజ్ సినిమా
రూ.99 టికెట్తో 24 గంటల పాటు
ఎన్నిసార్లైనా చూసే అవకాశం

