● జిల్లాలో పేరుకుపోయిన సమస్యలు ● నేడు ఆదిలాబాద్కు ముఖ్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆరోగ్య వరప్రదాయనిగా ఉన్న జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది. ప్రధానంగా క్యాన్సర్, గుండె సంబంధిత వైద్య నిపుణులు లేకపోవడంతో రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్పెషలిస్టు వైద్యులను పూర్తిస్థాయిలో నియమించి పేదలకు నాణ్యమైన వైద్యమందించాల్సిన అవసరముంది.
ఆదివాసీల జిల్లాగా పిలువబడే ఆదిలాబాద్లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కొన్నేళ్లుగా వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయంలో మంజూరైన గిరిజన యూనివర్సిటీని వరంగల్కు తరలించారు. అధికారంలోకి వస్తే ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో, ముఖ్యమంత్రి అయ్యాక ఇంద్రవెల్లి సభలో రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.
జిల్లాలో ప్రధానంగా సాగయ్యేది పత్తి. ఈ పంట సాగు చేసే రైతులకు కేంద్రం విధించిన తేమ శాతం నిబంధన శాపంగా మారుతోంది. 12శాతం లోపు ఉంటేనే సీసీఐ కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం వాతావరణం మారిన ప రిస్థితులతో అధికశాతం తేమ రావడంతో విఽ దిలేని పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్కు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ విషయంలో చొరవ చూపాలని దూది రైతులు వేడుకుంటున్నారు.
సోయా పరిమితి దాటిందనే కారణంతో కేంద్రం తాజాగా కొనుగోలు కేంద్రాలను నిలిపివేసింది. దీంతో రైతులు ప్రైవేట్కు అమ్ముకోవాల్సిన దుస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి కొనుగోళ్లు చేపట్టాలే చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లా కేంద్రంగా జేఎన్టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఇప్పటికి అది ఏర్పాటు కాలేదు. దీంతో ఇంజినీరింగ్ విద్యనభ్యసించాలనే వారికి ఇబ్బందులు తప్పడం లేదు.
భోరజ్ మండలంలో 51వేల ఎకరాలకు నీరందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రూ.1200 కోట్లతో లోయర్ పెన్గంగపై చేపట్టిన కోర్టా–చనాఖా ప్రాజెక్ట్ ట్రయల్ రన్ కూడా పూర్తయింది. హత్తిఘాట్ రిజర్వాయర్, డిస్ట్రిబ్యూటరీ సబ్ కెనాల్స్ మాత్రమే నిర్మించాల్సి ఉంది. రూ.200 కోట్లు విడుదల చేస్తే రైతులు రెండో పంట పండించేందుకు సాగునీరందించే అవకాశముంటుంది.
బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండ మండలం కుప్టి గ్రామం వద్ద కుప్టి ప్రాజెక్ట్ నిర్మించాలనే డిమాండ్ ఏళ్లుగా వినిపిస్తోంది. రూ.700 కోట్లతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ అంచనాలు రూ.1300 కోట్లకు పెరిగాయి. కానీ దీనికి మోక్షం లభించడం లేదు.
బోథ్ మండల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అనేక ఉద్యమాలు సైతం చేపట్టారు. దీనిపై సానుకూల ప్రకటన రావాలని కోరుకుంటున్నారు.
జిల్లా కేంద్రంలో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జిల భూసేకరణకు అవసరమైన రూ.27కోట్ల నిధులు ెరాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పెండింగ్లో ఉన్నాయి. వాటిని విడుదల చేస్తే ఆ బ్రిడ్జిల నిర్మాణాల పనులు వేగవంతం కానున్నాయి.
ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తూ భూసేకరణకు జీవో జారీ చేయడంపై ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చొరవపై ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. అవసరమైన నిధులు కూడా త్వరితగతిన విడుదల చేస్తే మేలని అభిప్రాయపడుతున్నారు.‘సాక్షి’ సైతం సామాజిక బాధ్యతగా భావించి వరు స కథనాల ద్వారా ఈ అంశాన్ని పాలకుల దృష్టికి తీసుకువెళ్లిన విషయం విదితమే.
రిమ్స్ ఆసుపత్రి
లోయర్ పెన్గంగపై
నిర్మించిన కొరటా–చనాఖా ప్రాజెక్ట్
సీఎం మధ్యాహ్నం 1.20 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్లో బయలుదేరి 2గంటలకు జిల్లా కేంద్రంలోని ఎరోడ్రమ్కు చేరుకుంటారు. 2.10 గంటలకు కాన్వాయ్ ద్వారా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకు చేరుకుంటారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 3.45గంటలకు స్టేడియం నుంచి హెలిప్యాడ్కు చేరుకుని హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు.
కైలాస్నగర్: ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో భాగంగా పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు. అక్కడి నుంచే పలు అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలు ఆవిష్కరించనున్నారు. ఇక జిల్లాలో సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు అనేకం ఉన్నాయి. విద్య, వైద్య, మౌలిక వసతుల పరంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతులు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతవాసులు సీఎం కల్పించే భరోసాపై గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటించిన సీఎం ఆ దిశగా ఏమైనా కార్యాచరణ ప్రకటిస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


