
హాయ్.. అయాం పూజ అంటూ టోకరా
● మహిళల పేరిట చాటింగ్ ● కోరిక తీరుస్తామంటూ ఎర ● తీరా వచ్చాక నిలువు దోపిడీ ● ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
కొత్తపల్లి(కరీంనగర్): ముగ్గురు యువకులు ముఠాగా ఏర్పడ్డారు. మహిళల పేరిట యువకులతో చాటింగ్ చేస్తూ కోరికలు తీరుస్తామంటూ ఎరవేస్తున్నారు. ఈ ఓ వ్యక్తిని మభ్యపెట్టి దోపిడీకి పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో వెలుగు చూసింది. ఇద్దరు యువకులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నాడు. కొత్తపల్లి పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపల్లి మండలం చింతకుంట శాంతినగర్కు చెందిన సరళ సందీప్(19), మల్కాపూర్ లక్ష్మిపూర్కు చెందిన పొన్నాల ప్రణయ్కుమార్(18), ఎండీ రెహాన్ జల్సాలకు అలవాటు పడి, దోపిడీలకు కొత్తరకం పన్నాగం పన్నారు. మహిళల పేరిట కోరిక తీరుస్తామంటూ వాట్సాప్లో యువకులకు మెసేజ్ చేస్తారు. ఆకర్షితులైన యువకులను చాటింగ్తో మభ్యపెడతారు. సరళ సందీప్ ఈ నెల 6న తన ఫోన్ ద్వారా మంచిర్యాల ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి వాట్సాప్లో హాయ్ అయాం పూజ అంటూ మెసేజ్ చేశాడు. స్పందించి యువకుడు చాటింగ్ చేశాడు. కోరిక తీరుస్తానంటూ ఆశ చూపడంతో అది నమ్మి ఈ నెల 11న కరీంనగర్ వచ్చాడు. పథకం ప్రకారం దోపిడీకి సిద్ధమైన ముగ్గురు యువకులు కొత్తపల్లికి రప్పించారు. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై యువకుడిని వెలిచాల శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న రెహాన్తో కలిసి యువకుడిని చిత్రహింసలకు గురి చేశారు. రూ.50వేలు డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే చంపుతామని బెదిరించడంతో తన వద్ద ఉన్న రూ.10వేలు ఇచ్చాడు. బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి మరో రూ.12వేలు ఫోన్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. ముగ్గురు నిందితులు సదరు యువకుడిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. బాధితుడు కొత్తపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఎస్ సాంబమూర్తి ఆధ్వర్యంలోని బృందం శుక్రవారం రేకుర్తి బస్టాండ్ ప్రాంతంలో సరళ సందీప్, పొన్నాల ప్రణయ్ కుమార్ను అరెస్టు చేశారు. రెహాన్ పరారీలో ఉన్నాడు.