breaking news
sandeep deshpande
-
శివసేన, ఎమ్మెన్నెస్ మధ్య ‘వై ఫై’ట్..!
సాక్షి, ముంబై: నగరంలో వై ఫై సేవల ప్రారంభంపై శివసేన, మహారాష్ర్ట నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. మహానగర పాలక సంస్థ(బీఎంసీ) తరఫున శివాజీ పార్క్ మైదానం పరిసరాల్లో వై ఫై సేవలు ప్రారంభిస్తామని గత ఏడాది మేయర్ సునీల్ ప్రభు ప్రకటించారు. కాని ఆ సేవలు ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. దీంతో వై ఫై సేవలను తాము ప్రారంభించనున్నట్లు ఎమ్మెన్నెస్ ప్రకటించింది.ఈ మేరకు సన్నాహాలు కూడా ప్రారంభించింది. దీంతో తేరుకున్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ తాము నగరంలో వై ఫై సేవల కల్పనకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను ఎమ్మెన్నెస్ నేత రాజ్ ఠాక్రే కొట్టిపారేశారు. నగరవాసులకు వై ఫై సేవలను అందుబాటులోకి తెస్తామని శివసేన చెప్పి ఏడాది దాటినా ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదని అందుకే తాము ముందుకు వచ్చామని ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభిస్తున్నట్లు బీఎంసీలోని ఎమ్మెన్నెస్ గట్ నాయకుడు సందీప్ దేశ్పాండే స్పష్టం చేశారు. దీనిపై సునీల్ ప్రభు మాట్లాడుతూ బీఎంసీ అనుమతి లేకుండా వై ఫై యంత్ర సామగ్రి ఏర్పాటు చట్టరీత్యా నేరమన్నారు. దీనిపై సందీప్ దేశ్పాండేది తొందరపాటు చర్య అని ఆరోపించారు. బీఎంసీ తరఫున త్వరలోనే వై ఫై సేవలు ప్రారంభిస్తామని ప్రకటించారు. -
రోగులకు మంచిరోజులు
సాక్షి, ముంబై: బీఎంసీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు నాణ్యమైన భోజనం అందజేయాలని పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. రోగులకు భోజనం సరఫరా చేసే బాధ్యతలు విలేపార్లేలోని ఇస్కాన్ సంస్థకు అప్పగించింది. ఇప్పటిదాకా బీఎంసీ ఆస్పత్రుల్లోని రోగులకు పరిపాలన విభాగమే భోజనం పంపిణీ చేస్తోంది. ఇక నుంచి ఈ బాధ్యతను ‘ఇస్కాన్ ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్’ నిర్వహించనుంది. ఈ బాధ్యతను ఎవరికి అప్పగించాలా? అనే విషయమై మొదట టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్)కు చెందిన గట్ నాయకుడు సందీప్ దేశ్పాండే కూడా ఈ డిమాండ్ను బలంగా వినిపించారు. కాని అధికారంలో ఉన్న నాయకులు వారి డిమాండ్ను పట్టించుకోకుండానే ఇస్కాన్ వైపు మొగ్గు చూపారు. అయితే భోజనం పంపిణీచేసే ఈ పథకాన్ని ముందుగా విలేపార్లేలోని కూపర్ ఆస్పత్రి నుంచి ప్రారంభించనున్నారు. అందుకు రూ.1.97 కోట్లు ఖర్చుకానుంది. ఈ మొత్తంతో ఇస్కాన్ ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్.. రోగులకు రెండు పూటల భోజనంతోపాటు టీ, అల్పాహారం అందజేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. పెరిగిన రోగుల సంఖ్య... కూపర్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఇక్కడ 636 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. గతంలో రోగులకు భోజనం సరఫరా చేయాలంటే బీఎంసీ పరిపాలన విభాగానికి రూ.1.99 కోట్లు ఖర్చయ్యేది. రోగుల సంఖ్య పెరగడంతో వంటశాల సిబ్బంది, వార్డుబాయ్ల సంఖ్య కూడా పెంచాల్సి ఉంటుంది. దీని కారణంగా వ్యయం పెరిగే అవకాశముంది. కాని ఇస్కాన్ సంస్థ మాత్రం రూ.1.97 కోట్లకే రెండు పూటల భోజనం, టీ, అల్పాహారం అందజేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఇస్కాన్ సంస్థకే కాంట్రాక్టు ఇవ్వాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనకు మంగళవారం జరిగిన స్థాయి సమితి సమావేశంలో ఆమోదం లభించింది. బీఎంసీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గతంలో మహిళా పొదుపు సంఘాల ద్వారా కిచిడీ పంపిణీ జరిగేది. ప్రస్తుతం దీన్ని కూడా నిలిపివేసి ఇస్కాన్ సంస్థకు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లు బీఎంసీ అదనపు కమిషనర్ మోహన్ అడ్తానీ చెప్పారు.