Postgraduate medical education counseling
-
నీట్–పీజీ సీట్లు బ్లాక్ చేయకుండా కఠినచర్యలు తీసుకోవాలి
న్యూఢిల్లీ: పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ల విషయంలో కొన్ని కాలేజీలు ముందుగానే సీట్లు బ్లాక్ చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నీట్–పీజీకి సంబంధించి కౌన్సెలింగ్కు ముందే ఫీజుల వివరాలు బహిర్గతం చేయాలని అన్ని ప్రైవేట్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలను ఆదేశించింది. సీట్ల బ్లాకింగ్ వల్ల అవకాశం కోల్పోయిన ఇద్దరు అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలని అలహాబాద్ హైకోర్టు గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని, లక్నోలోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ జనరల్కు ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టర్ జనరల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్తో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. మెడికల్ పీజీ సీట్లను ముందుగానే బ్లాక్ చేసి, ఇష్టా్టనుసారంగా విక్రయించుకోవడం అనేది తప్పుడు చర్య మాత్రమే కాకుండా, వ్యవస్థలో లోపాలకు ఉదాహరణ అని వెల్లడించింది. పారదర్శకత లేకపోవడానికి, ప్రభుత్వ విధానాలు బలహీనంగా ఉండడానికి నిదర్శనమని తెలియజేసింది. సీట్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌన్సెలింగ్కు ముందే ఫీజులను వెల్లడించడం తప్పనిసరి అని స్పష్టంచేసింది. ట్యూషన్, హాస్టల్ ఫీజులు, కాషన్ డిపాజిట్తోపాటు ఇతర ఫీజులను విద్యార్థులకు తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. నేషనల్ మెడికల్ కమిషన్ ఆధ్వర్యంలో కేంద్రీకృత ఫీజుల నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. సీట్లు బ్లాక్ చేసే కాలేజీలకు జరిమానాలు విధించాలని స్పష్టంచేసింది. ఆయా కాలేజీలపై అనర్హత వేటు వేయాలని పేర్కొంది. -
29 నుంచి పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్
* తెలంగాణ విద్యార్థులకూ విజయవాడలోనే... * వ్యతిరేకిస్తున్న విద్యార్థులు... * హైదరాబాద్కు మార్చాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ విద్యార్థులకు కూడా విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అయితే 2015-16 సంవత్సరంలో పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్ ప్రక్రియను హైదరాబాద్లోనే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుండగా... ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం మాత్రం మొదటి నుంచీ ససేమిరా అంటోంది. అన్ని ఏర్పాట్లు ఉన్న విజయవాడలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది. హైదరాబాద్లోనే కౌన్సెలింగ్ నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై జూనియర్ డాక్టర్ల సంఘం కన్వీనర్ శ్రీనివాస్ ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ముఖ్య కార్యదర్శి సురేష్చందాను కలసి ఈ మేరకు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1,140 పీజీ వైద్య సీట్లు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 1,140 పీజీ వైద్య సీట్లు ఉండగా అందులో 515 సీట్లు ప్రభుత్వ, 625 సీట్లు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. నిబంధనల ప్రకారం 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులతో... 15 శాతం సీట్లను అన్రిజర్వ్డ్గా భర్తీ చేయాలి. గతేడాది ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ సహకారంతో ఎంబీబీఎస్, డెంటల్ వైద్య విద్య కౌన్సెలింగ్ ప్రక్రియను హైదరాబాద్, వరంగల్లో నిర్వహించగా... పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్ను మాత్రం విజయవాడలోనే నిర్వహించారు. అయితే అప్పట్లో పీజీ వైద్య విద్య సీట్ల కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులు ఆందోళన చేశారు. అప్రాధాన్యమైన సీట్లను తమకు కేటాయించారంటూ తెలంగాణ విద్యార్థులు నిరసన తెలపడంతో 2 రోజులు కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఈ ఏడాది కౌన్సెలింగ్ను హైదరాబాద్లోనే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సమయం తక్కువగా ఉండటం వల్ల 2 రాష్ట్రాల విద్యార్థులకు కలిపి విజయవాడలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. కాగా, పీజీ కౌన్సెలింగ్పై చర్చించేందుకు వైద్య విద్యా సంచాలకులు పుట్టా శ్రీనివాస్ శుక్రవారం వర్సిటీ అధికారులతో సమావేశమవనున్నట్లు సమాచారం.