రాష్ట్ర అప్పులు 1,82,000 కోట్లు

Telangana State Has Crossed One Lakh Crore Debt - Sakshi

తెలంగాణ వచ్చాక లక్ష కోట్లు అప్పు చేశామని స్పష్టీకరణ

అప్పులన్నీ కేంద్ర నిబంధనలు, చట్టప్రకారమే జరిగాయని ఉద్ఘాటన

ఈ నెలాఖరు నుంచే అన్నదాతలకు రైతుబంధు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ. 1.82 లక్షల కోట్లు అని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. అం దులో తెలంగాణ రాకముందు రూ. 82 వేల కోట్ల అప్పులుండగా, రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు రూ. లక్ష కోట్లు అప్పు చేసినట్లు వివరిం చారు. అప్పులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిబం ధనలు, చట్ట పరిధిలోనే చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంగళ వారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు వేతనాలు, ఆసరా పెన్షన్లు, ప్రాజెక్టుల బిల్లులు, సంక్షేమ పథకా లకు నిధులను సకాలంలోనే చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతేడాది అధిక ఆర్థికవృద్ధి నమోదైం దన్నారు. ఆర్థిక వృద్ధిరేటు నమోదులో తెలం గాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, స్టేట్‌ ఓన్‌ ట్యాక్స్‌లోనూ తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు.

కేంద్ర గణాంకాల  లెక్కల ప్రకారం 2018–19 రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.8,65,875 కోట్లు అని ఆయన వెల్లడించారు. గతేడాది రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 15 శాతమన్నారు. ఐదేళ్లలో తెలంగాణ కాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ 1,64,519 కోట్లు అని ఆయన పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తుంటామని, నెలకు సుమారు రూ. 2 వేల కోట్ల వరకు బిల్లులు క్లియర్‌ చేస్తుంటామని తెలిపారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.46,960 కోట్లు అని, ఇప్పటివరకు ప్రాజెక్టుపై రూ. 27,509 కోట్లు ఖర్చు చేశామన్నారు. మిషన్‌ భగీరథలో పెండింగ్‌ బిల్లులు రూ. 659 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రభుత్వ పథకాలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పింఛన్లకు అవసరమైన నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, రైతుబంధుకోసం రబీ సీజన్‌లో రూ. 5,200 కోట్లు విడుదల చేశామని చెప్పారు.

పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తెలిపారు. ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయన్నారు. రైతుబంధు పథకం నిధులు రైతులకు ఆన్‌లైన్‌లో చెల్లిస్తామని, రైతుకు ఇబ్బంది లేకుండా రుణమాఫీని అమలు చేస్తామన్నారు. ‘మే నెలాఖరు నుంచి జూన్‌ మొదటి వారం వరకు రైతుబంధు సాయం పంపిణీ చేస్తాం. పింఛన్లకు అవసరమైన నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి’అని స్పష్టం చేశారు. రాష్ట్రం వృద్ధిరేటు 14 శాతం కంటే తక్కువ ఉంటే... కేంద్రం జీఎస్టీ మినహాయింపు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు కేవలం రూ. 3,474 కోట్లు మాత్రమే అని వివరించారు.

ట్యాక్స్‌ పెరిగింది...
తెలంగాణ ఏర్పాటయ్యాక అత్యంత వృద్ధిని సాధించామని రామకృష్ణారావు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లలో జరిగిన అభివృద్ధికంటే  ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి ఎక్కువుందన్నారు. ప్రాథమిక రంగంలో 10.9 శాతం, సెకండరీ సెక్టార్‌లో 14.9 శాతం వృద్ధి సాధించామని, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ట్యాక్స్‌ రెవెన్యూ 2018–19లో 14.5 శాతం పెరిగిందన్నారు. అంటే రూ. 64,714 కోట్లు వచ్చిందన్నారు. క్యాపిటల్‌ ఎక్స్‌పెండేచర్‌ బడ్జెట్‌ 22,904 కోట్లు, బడ్జెటేతర ఖర్చు 24,130 కోట్లు అని తెలిపారు. నెలన్నరలోగా మొత్తం బిల్లుల చెల్లింపు జరుగుతుందన్నారు. రైతుబంధు, రుణ మాఫీ, ఆసరా పింఛన్లకు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో 6 నెలలకు బడ్జెట్‌ పెట్టామన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల ఇబ్బంది లేకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. 

బిల్లుల చెల్లింపులో జాప్యం నిజమే
ఎఫ్‌ఆర్‌బీఎం 2004 ప్రకారం జీడీపీలో 3 శాతం రుణాలు తీసుకోవచ్చు. ఆ ప్రకారం ఈ ఏడాది రూ. 29,750 కోట్లు తీసుకోవడానికి అనుమతి ఉందన్నారు. నిధులు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్‌ కారణంగా చెల్లింపుల్లో జాప్యం జరిగినమాట నిజమేనన్నారు. ఏప్రిల్‌ నెలలో సహజంగా ఖర్చు తక్కువగా ఉంటుందన్నారు. ప్రతి నెల రూ.12 వేల కోట్లు నిధులు వస్తాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేస్తున్నామన్నారు. రైతుబంధు చెల్లింపులో బకాయిలు లేవని, రబీలో 52 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందజేశామన్నారు. చిన్న కాంట్రాక్టర్లకు ఇబ్బందులు లేకుండా ప్రాధాన్యతా క్రమంలో చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం 14 లక్షల మంది విద్యార్థులకు రూ. 3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.

2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో వృద్ధి రేటు భారీగా పెరిగిందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. జీడీపీలో 9 శాతం పన్నుల రూపంలో వసూలు చేస్తున్నామన్నారు. 2018–19లో ట్యాక్స్‌ రెవెన్యూ 14.5 శాతమని, గత ఐదేళ్ల సరాసరి 16.5 శాతంగా ఉందని చెప్పారు. గ్రామీణ రోడ్లు, గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానం, వ్యవసాయానికి చేస్తున్న ఖర్చులు అభివృద్ధి కిందకే వస్తాయని వివరించారు. కేంద్రం క్యాపిటల్‌ ఎక్స్‌పెండేచర్‌ 10 శాతముంటే, రాష్ట్రంలో 25 శాతం ఉందన్నారు. రాష్ట్ర రెవెన్యూ, పన్నుల రాబడిని చూసి ఆర్‌బీఐ ప్రశంసించిందన్నారు. కేరళ, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలు జీడీపీలో 35 నుంచి 45 శాతం వరకు అప్పులు తీసుకుంటే, తెలంగాణ కేవలం 22 శాతమే తీసుకుందన్నారు. గత డిసెంబర్‌ వరకు సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేశామని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే జీడీపీ పెరుగుతుందని ఆయన తెలిపారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top