ఇంటిముందు చెత్త వేయద్దన్నందుకు..
సాక్షి, హైదరాబాద్ : తమ ఇంటిముందు చెత్త వేయవద్దని అన్నందుకు తల్లీకూతుళ్లపై దాడికి పాల్పడ్డారు కొందరు యువకులు. ఈ సంఘటన బుధవారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్కు చెందిన ఓ మహిళ ఇంటి ముందు కొందరు యువకులు తరుచూ చెత్త వేస్తుండేవారు. ఈ నేపథ్యంలో బుధవారం కూడా వారు చెత్త వేయటానికి ప్రయత్నించగా.. తన ఇంటిముందు చెత్త వేయవద్దని, చెత్తకుండీలో వేయండని ఆ మహిళ సదరు యువకులను కోరింది. అయితే ఆగ్రహించిన యువకులు మహిళపై దాడికి తెగబడ్డారు. అడ్డువచ్చిన మహిళ కూతురిని కూడా విచక్షణారహితంగా చితకబాదారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. యువకుల దాడిలో గాయపడిన తల్లీకూతుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయండని అంటూ కన్నీరుమున్నీరయ్యారు.