ప్రవర్తన సరిగా లేనందుకే..

Man Murdered To a Women in Choppadandi - Sakshi

సోదరినే దారుణంగా హత్య చేసిన అన్న

సాక్షి, రామడుగు(కరీంనగర్‌) : మహిళను దారుణంగా హత్యచేసిన నిందితులను చొప్పదండి సీఐ రమేశ్, రామడుగు ఎస్సై రవికుమార్‌ సంఘటన జరిగిన పన్నెండు గంటలలోపే అదుపులోకి తీసుకొని సోమవారం రిమాండ్‌కు తరలించారు. రామడుగు పోలీసుస్టేషన్‌లో హత్య వివరాలను వెల్లడించారు. మండలంలోని వెదిర గ్రామపంచాయతీ పరిధిలో గల రాజాజినగర్‌లో రాగమల్ల అమల కొద్ది రోజులుగా బిర్యాని సెంటర్‌ను నడిపిస్తోంది. ఆదివారం రాత్రి హోటల్‌ మూసివేసే సమయంలో ముగ్గురు వ్యక్తులు వాహనంపై వచ్చి దారుణంగా హత్యచేసి పారిపోయారు. సంఘటనపై స్పందించిన పోలీసులు అనుమానితుల ఫోన్‌నంబర్లను ట్రేస్‌ చేసి సోమవారం ఉదయం వెలిచాల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసినవారిలో మృతురాలి సోదరుడు రామంచ అనిల్‌తో పాటు శేఖర్, ప్రమోద్‌రెడ్డి ఉన్నారు.

అమలకు సిద్దిపేట జిల్లా పుల్లూరు గ్రామానికి చెందిన స్వామితో వివాహం జరిగింది. అమల సోదరుడు అనిల్, స్వామి సోదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం అమల ప్రవర్తన సరిగా లేదని భర్త స్వామి విడాకులు తీసుకున్నాడు. దీంతో భర్తను వదిలేసి కొద్దిరోజులు రేకుర్తిలో హోటల్‌ నడిపి ఇటీవలే రాజాజినగర్‌లో బిర్యాని సెంట ర్‌ను ప్రారంభించింది. అమల ప్రవర్తన సరిగా లేక పోవడంతో పాటు, తనభార్యను ఇష్టానుసారంగా తిట్టడం, ఆస్తిలో వాటా అడుగుతోందని కోపం పెంచుకున్న అనిల్‌ హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. రేకుర్తిలో ఒకసారి ప్రయత్నిం చగా విఫలం కావడంతో కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. కాగా ఆదివారం రాత్రి తన స్నేహితులు శేఖర్, ప్రమోద్‌రెడ్డిలతో రాజాజినగర్‌ చేరుకున్నాడు. బిర్యాని సెంటర్‌ మూసివేస్తున్న తరుణంలో ముగ్గురు కత్తులతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top