'చమురు' వదులుతుందేమో!!

union budject 2018  - Sakshi

2017–18లో 6.75 శాతానికి వృద్ధి రేటు

2018–19లో 7–7.5 శాతానికి చేరొచ్చు

డీమో, జీఎస్‌టీ ప్రభావాలు పోతున్నాయి

కానీ పెరిగే చమురు ధరలతోనే చిక్కంతా

దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదముంది

పెరిగిపోయిన షేర్ల ధరలు కూడా పడిపోవచ్చు

తాజా పరిస్థితిని, భవిష్యత్‌ను ఆవిష్కరించిన ఆర్థిక సర్వే

పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి జైట్లీ  

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ తాలూకు ప్రభావాల నుంచి బయటపడి దేశ ఆర్థిక వ్యవస్థ చక్కగా పుంజుకుంటోందని, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 7– 7.5 శాతం స్థాయిలో వృద్ధి రేటు నమోదవుతుందని 2017–18 సంవత్సర ఆర్థిక సర్వే స్పష్టంచేసింది. సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంటు ముందుంచిన ఈ సర్వే... ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా మళ్లీ గత స్థానానికి చేరుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తంచేసింది.

 ‘‘ప్రపంచ వృద్ధి రేటు 2018లో ఒక మోస్తరు స్థాయిలోనే పురోగమిస్తుంది. మనకైతే జీఎస్‌టీ పూర్తి స్థాయిలో స్థిర పడటం, పెట్టుబడులు పెరిగే అవకాశాలు, కొనసాగుతున్న సంస్కరణలు అధిక వృద్ధి రేటుకు అనుకూలాంశాలుగా కనిపిస్తున్నాయి. కాకపోతే పెరుగుతున్న చమురు ధరలు, పెరిగిన స్టాక్‌ ధరల్లో భారీ కరెక్షన్‌ వంటి సవాళ్లుంటాయి. వీటి కారణంగా విదేశీ నిధుల రాక ఆగిపోతుంది’’ అని సర్వే అభిప్రాయపడింది.

కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు రూపొందించిన ఈ సర్వేను... మరో రెండు రోజుల్లో (ఫిబ్రవరి 1న) బడ్జెట్‌ సమర్పించనున్న నేపథ్యంలో సోమవారం లోక్‌సభలో జైట్లీ ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ద్రవ్య క్రమశిక్షణ నిలిచిపోయే అవకాశాన్ని సర్వే తోసిపుచ్చలేదు.

అంచనాలను మించే వృద్ధి...
ఈ ఆర్థిక సంవత్సరంలో (2017–18) జీడీపీ వృద్ధి 6.75 శాతంగా నమోదవుతుందని సర్వే పేర్కొంది. కాకపోతే ఇది 6.5 శాతంగా ఉండొచ్చని ఇటీవలే కేంద్ర గణాంకాల విభాగం పేర్కొనడం గమనార్హం. 2016–17లో జీడీపీ వృద్ధి 7.1 శాతం కాగా, 2014–15లో ఇది ఏకంగా 8 శాతంగా ఉంది.

2017–18కు స్థూలంగా జోడించిన విలువ (జీవీఏ) 6.1 శాతంగా సర్వే అంచనా వేసింది. గతేడాది ఇది 6.6 శాతం. ఎగుమతులు, ప్రైవేటు పెట్టుబడులు వచ్చే సంవత్సరంలో తిరిగి పుంజుకుంటాయంటూ... జీఎస్‌టీ సాధారణ స్థితికి చేరడం, రెండు రకాల బ్యాలన్స్‌ షీటు చర్యలు, ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణతో ఆర్థిక రంగంలో (మాక్రో) స్థిరత్వం నెలకొంటుందని అంచనా వేసింది.

సవాళ్లు పొంచి ఉన్నాయి...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దిగుమతి చేసుకునే చమురు ధరలు సగటున 14 శాతం పెరగ్గా, 2018–19 ఆర్థిక సంవత్సరంలోనూ 10–15 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో విధానాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ‘‘మధ్య కాలానికి మూడు విభాగాలపై దృష్టి సారించాలి. ఇందులో ఉద్యోగాల కల్పన ఒకటి. యువతకు, ముఖ్యంగా మహిళలకు మంచి ఉద్యోగ అవకాశాలుండాలి. విద్యావంతులైన, ఆరోగ్యవంతులైన కార్మిక శక్తిని సృష్టించడం రెండోది.

సాగు ఉత్పాదనను పెంచడం మూడోది. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలున్నం దున ఆర్థిక నిర్వహణ సవాలుగా ఉంటుంది’’ అని సర్వే హెచ్చరించింది. వ్యాపార నిర్వహణలో మరింత సులభతర దేశంగా భారత్‌ను మార్చేందుకు అప్పిలేట్, న్యాయ విభాగాల్లో జాప్యం, అపరిష్కృత పరిస్థితులను తొలగించాలని సూచించింది. ఇందుకోసం ప్రభుత్వం, న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయంతో కూడిన చర్యల అవసరాన్ని సర్వే గుర్తు చేసింది.

ఆర్థిక వ్యవస్థ చక్కగా, బలంగా ఊపందుకుంటోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ తాలూకు తాత్కాలిక ప్రభావాలు సమసిపోయాయి. ఎగుమతులు పుంజుకుంటే వృద్ధి రేటు 7.5 శాతం కంటే ఎక్కువే నమోదవుతుంది. అయితే పెరుగుతున్న చమురు ధరలు, పెరిగిన స్టాక్‌ ధరల్లో కరెక్షన్‌ అన్నవి డౌన్‌సైడ్‌ రిస్క్‌లు. ద్రవ్యోల్బణం 0.2–0.3 శాతం పెరిగితే జీడీపీ కూడా ఆ మేరకు ప్రభావితం అవుతుంది. చమురు ధరలు బ్యారెల్‌కు 10 డాలర్లు పెరిగితే కరెంటు ఖాతా లోటు మరింత విస్తరిస్తుంది.’’ – అరవింద్‌ సుబ్రమణియన్,  కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు

ఇవీ... ముఖ్యాంశాలు

2017–18లో జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతంగా ఉండొచ్చు.
 2018–19లో ఇది 7–7.5%కి చేరుతుంది
చమురు ధరలు పెరిగినా లేక షేర్ల ధరలు పడినా విధానపరమైన చర్యలు అవసరం.
వ్యవసాయానికి సహకారం పెంచడం, ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ, బ్యాంకుల రీక్యాపిటలైజేషన్‌ వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలి.
 పరోక్ష పన్నులు 50 శాతం పెరిగినట్టు జీఎస్‌టీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
 రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు ఇతర సమాఖ్య దేశాలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి.
పెద్ద నోట్ల రద్దు కారణంగా ఆర్థిక పొదుపునకు ప్రోత్సాహం లభించింది.
♦  2017–18లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.3 శాతం. గత 6 ఆర్థిక సంవత్సరాల్లో ఇదే కనిష్ట స్థాయి.
2017–18లో సంస్కరణల కారణంగా సేవల రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 15 శాతం పెరిగాయి.
కార్మిక చట్టాలు మెరుగ్గా అమలు చేసేందుకు టెక్నాలజీని వినియోగించాలి.
స్వచ్ఛభారత్‌ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల వసతులు పెరిగాయి. 2014లో 39 శాతమే ఉంటే, 2018 నాటికి 76%కి చేరాయి.
సమ్మిళిత వృద్ధికి గాను విద్య, ఆరోగ్యం వంటి సామాజిక రంగాలకు ప్రాధాన్యమివ్వాలి.

ఇన్‌ఫ్రాకు 2040కి 4.5 ట్రిలియన్‌ డాలర్లు
దేశంలో మౌలిక రంగ అభివృద్ధికి వచ్చే 25 సంవత్సరాల్లో 4.5 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే,  3.9 ట్రిలియన్‌ డాలర్లను మాత్రమే సమీకరించుకోగలిగే అవకాశముంది.  ప్రైవేటు పెట్టుబడులతోపాటు, నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌ఐఐబీ), ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌(ఏఐఐబీ), న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (బ్రిక్స్‌ బ్యాంక్‌) ద్వారా మౌలికానికి పెట్టుబడులను సమీకరించుకోవాలి.

విదేశీయుల పర్యటనలు పెరిగాయి...
పర్యాటక రంగం అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల వల్ల దేశంలో విదేశీయుల పర్యటనలు గణనీయంగా పెరిగాయి. పర్యాటకం ద్వారా 2017లో విదేశీ మారక ఆదాయం 29 శాతం పెరిగి, 27.7 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇక పర్యాటకుల సంఖ్య 15.6 శాతం పెరిగి, 1.02 కోట్లుగా నమోదైంది. పర్యాటకం అభివృద్ధి దిశలో ఈ–వీసా, ది హెరిటేజ్‌ ట్రైల్‌ వంటి అంశాలతో సహా ప్రభుత్వం ఈ విషయంలో చేపట్టిన ప్రచారం కూడా కలిసివచ్చాయి.

జీఎస్‌టీతో పెరిగిన ‘పరోక్ష’ పన్ను బేస్‌
జూలై నుంచీ అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను తో పరోక్ష పన్ను చెల్లింపుదారుల సంఖ్య 50 శాతంపైగా పెరిగింది. 34 లక్షల వ్యాపార సంస్థలు పన్ను పరిధిలోకి వచ్చాయి. పలు చిన్న పరిశ్రమల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. జీఎస్‌టీ వసూళ్ల పట్ల కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ, ఒకసారి వ్యవస్థ స్థిరపడిన తర్వాత, ఆయా పరిస్థితులన్నీ తొలగిపోతాయి.  జనవరి 24 వరకూ జీఎస్‌టీ కింద కోటి మంది పన్ను చెల్లింపుదారులు నమోదయ్యారు.

ఎగుమతులూ పుంజుకుంటాయి..
అంతర్జాతీయ వాణిజ్యం పెరగనున్న నేపథ్యంలో మున్ముందు దేశీ ఎగుమతులు కూడా పుంజుకోగలవని సర్వే అంచనా వేసింది. అయితే, చమురు ధరల పెరుగుదల మాత్రం సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని పేర్కొంది. 2016లో 2.4 శాతంగా ఉన్న ప్రపంచ వాణిజ్యం.. 2017లో 4.2 శాతం, 2018లో 4 శాతం మేర వృద్ధి చెందగలదని అంచనా వేసింది.

డీమోనిటైజేషన్‌తో పెరిగిన గృహ పొదుపు
పెద్ద నోట్ల రద్దు వల్ల బహుళ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం ఇందులో ఒకటి. అలాగే గృహ పొదుపు రేట్లూ పెరిగాయి. పెట్టుబడుల పునరుద్ధరణలో పొదుపు రేటు పెంపు కీలకాంశం.  అలాగే సాంప్రదాయకంగా బంగారంపై చేసే వ్యయాలను నగదు సంబంధ పొదుపులవైపు మళ్లించడానికి విధానపరమైన ప్రాధాన్యత ఇవ్వాలి. నగదు వాడకం తగ్గి, ఎలక్ట్రానిక్‌ విధానాల ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరగడం డీమోనిటైజేషన్‌ వల్ల ఒనగూరిన ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి.

ఎన్‌పీఏల పరిష్కారంలో ఐబీసీది కీలకపాత్ర
బ్యాంకుల్లో పేరుకున్న రూ.8 లక్షల కోట్ల  మొండిబకాయిల (ఎన్‌పీఏ) పరిష్కారానికి కొత్త దివాలా చట్టం (ఐబీసీ) పటిష్టవంతమైన యంత్రాంగాన్ని అందిస్తోంది. పలు వివాదాల పరిష్కారానికి నిర్ధిష్టమైన కాలపరిమితులను  నిర్దేశిస్తోంది. కార్పొరేట్ల బ్యాలెన్స్‌ షీట్లను మెరుగుపరచుకోవటానికి తగిన విధివిధానాలను అందిస్తోంది.  ట్విన్‌ బ్యాలెన్స్‌ షీట్‌ (టీబీఎస్‌) చర్యలు దీర్ఘకాలిక సమస్యపరిష్కారంలో ప్రధానమైనవి. ప్రస్తుతం దివాలా ప్రొసీడింగ్స్‌ కింద 11 కంపెనీలకు చెందిన  రూ.3.13 కోట్ల విలువైన క్లెయిమ్స్‌ ఉన్నాయి.

ఆరేళ్ల కనిష్టానికి సగటు ద్రవ్యోల్బణం
2017–18లో సగటు ద్రవ్యోల్బ ణం 3.3 శాతం. ఇది ఆరేళ్ల కనిష్టస్థాయి. ఒక స్థిర ధరల వ్యవస్థవైపు ఆర్థికవ్యవస్థ పురోగమిస్తోంది. ధరల కట్టడి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటి. హౌసింగ్, ఇంధనం మిగిలిన ప్రధాన కమోడిటీ గ్రూపులన్నింటిలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది. సీజనల్‌ ఇబ్బందుల వల్ల ఇటీవల కూరగాయలు, పండ్ల ధరలు పెరిగాయి.  సరఫరాల్లో ఇబ్బందుల తొలగించి ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుంది.

‘గులాబీ బాల’ను గౌరవిద్దాం!
మహిళల ప్రాధాన్యాన్ని వివరించిన సర్వే  
ఆడవారిని గులాబీలతో పోలుస్తారు. అంతటి సుకుమారులు కనకే వారిని ‘గులాబీ బాల’ అని సంబోధిస్తుంటారు. బహుశా.. అందుకేనేమో!! ఈ సారి సర్వేలో మహిళల ప్రాధాన్యాన్ని, లింగ వివక్షపై వ్యతిరేకతను చాటడానికి మోదీ ప్రభుత్వం గులాబీ రంగును ఎంచుకుంది. సర్వే కవర్‌ పేజీ సహా గులాబీ రంగులో మెరిసింది. మహిళలపై హింసకు ముగింపు పలకాలన్న ఉద్యమానికి మద్దతుగానే కవర్‌ పేజీకి గులాబీ రంగులద్దారన్నది నిపుణుల మాట.

‘‘కనీసం ఒక్క కుమారుడినైనా కలిగి ఉండాలన్న సామాజిక ప్రాధాన్యతను భారత్‌ వ్యతిరేకించాలి. స్త్రీ, పురుషులను సమానంగా అభివృద్ధి చేయాలి’’ అని పేర్కొంది. ‘‘47 శాతం మహిళలు ఎటువంటి గర్భనిరోధకాలూ వాడటం లేదు. వాడే వారిలో కూడా మూడోవంతు కన్నా తక్కువ మంది మాత్రమే పూర్తిగా మహిళలకు సంబంధించిన గర్భ నిరోధకాలు వాడుతున్నారు’’ అని సర్వే తెలియజేసింది.

నిర్మాణ రంగంలో కోటిన్నర కొత్త ఉద్యోగాలు
కొన్నాళ్లుగా స్థిరాస్తి.. నిర్మాణ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఇందులో వచ్చే అయిదేళ్లలో 1.5 కోట్ల  ఉద్యోగాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించడంలో వ్యవసాయం తర్వాత రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగం కలిపి రెండో స్థానంలో ఉన్నట్లు తెలియజేసింది. ‘‘2013లో ఈ రంగంలో 4 కోట్లపైగా సి బ్బంది ఉండగా.. 2017కి ఈ సంఖ్య 5.2 కోట్లకు చేరింది.

2022 నాటికి 6.7 కోట్లకు చేరొచ్చు. ఏటా 30 లక్షల ఉద్యోగాల చొప్పున  అయిదేళ్లలో కోటిన్నర ఉద్యోగాల కల్పన జరగవచ్చు‘ అని సర్వే వివరించింది. రియల్టీ, కన్‌స్ట్రక్షన్‌ రంగంలో 90% మంది నిర్మాణ కార్యకలాపాల్లో పనిచేస్తుండగా, మిగతా 10% ఫినిషింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్‌ పనుల్లో ఉంటున్నారు.

ఫండ్స్‌పై పెరుగుతున్న మక్కువ
గత ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపు... బ్యాంక్‌ డిపాజిట్లలో 82%, జీవిత బీమా ఫండ్స్‌లో 66 శాతం, షేర్లు, డిబెంచర్లలో 345% చొప్పున పెరిగాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌పై ఇన్వెస్టర్ల మక్కువ పెరుగుతోంది.  ఫండ్స్‌ పొదుపులు 400 శాతం వృద్ధి చెందాయి. కేవలం రెండేళ్లలోనే ఫండ్స్‌ పొదుపులు 11 రెట్లు పెరిగాయి.

ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–అక్టోబర్‌ నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి రూ.2.53 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి. దీంతో గత ఏడాది అక్టోబర్‌ 31 నాటికి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల నిర్వహణ ఆస్తులు రూ.21.43 లక్షల కోట్లకు పెరిగింది.

వనరులు తక్కువైనా విద్య, ఆరోగ్యంపై దృష్టి
పరిమిత వనరులున్నా.. విద్య, ఆరోగ్యాలకు ప్రభుత్వం గణనీయ ప్రాధాన్యమిస్తోందని సర్వే తెలిపింది. ‘భారత్‌ వర్ధమాన దేశం. విద్య, ఆరోగ్యం వంటి కీలకమైన మౌలిక సదుపాయాలపై భారీగా వెచ్చించేందుకు వెసులుబాటుండదు. ప్రభుత్వం మాత్రం వీటిని మెరుగుపర్చేందుకు నిరంతరం ప్రాధాన్యమిస్తూనే ఉంది.

సామాజిక సంక్షేమం దృష్ట్యా పథకాలపై వ్యయాలను స్థూల రాష్ట్రీయోత్పత్తిలో (జీఎస్‌డీపీ) 2016–17లో 6.9%కి పెంచినట్లు తెలిపింది. 2014–15లో ఇది 6%. బాలికల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన బేటీ బచావో, బేటీ పఢావో పథకాన్ని దేశవ్యాప్తంగా మొత్తం 640 జిల్లాలకు విస్తరించనున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top