ప్రాణం తీసిన వన్‌వే.. | one way road felt dangerous | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన వన్‌వే..

Feb 26 2014 4:22 AM | Updated on Mar 18 2019 8:51 PM

నేతలకు వినోదం... ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. కాంగ్రెస్ నేతలు జిల్లాకు వస్తున్న సందర్భంగా రాజీవ్ రహదారిపై వన్‌వే చేయడంతో బస్సు ఢీకొని నుస్తులాపూర్‌కు చెందిన దుర్శేటి రాజయ్య(50) మరణించాడు.

 తిమ్మాపూర్, న్యూస్‌లైన్ : నేతలకు వినోదం... ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. కాంగ్రెస్ నేతలు జిల్లాకు వస్తున్న సందర్భంగా రాజీవ్ రహదారిపై వన్‌వే చేయడంతో బస్సు ఢీకొని నుస్తులాపూర్‌కు చెందిన దుర్శేటి రాజయ్య(50) మరణించాడు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి మొదటిసారిగా జిల్లా కేంద్రానికి మంగళవారం రావడంతో తిమ్మాపూర్‌లో పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీ  ఉండడంతో తిమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను వన్‌వేకి మళ్లించారు. అక్కడ నుంచి అల్గునూర్ వరకు వన్‌వే కొనసాగించారు. అల్గునూర్ డైట్ కళాశాల తర్వాత తమిళకాలనీ మూలమలుపు వద్ద ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు వన్‌వేలో ఓవర్‌టేక్ చేస్తూ ఎదురుగా టీవీఎస్ వాహనంపై వస్తున్న రాజయ్యను ఢీకొట్టింది. అతని తలకు తీవ్రగాయాలయ్యాయి.
 
 ఇరుక్కుపోయిన 108
 ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రాజయ్యను చూసి స్థానికులు 108కు సమాచారం అందించారు. కరీంనగర్, మానకొండూర్ నుంచి అంబులెన్స్‌లు బయలుదేరి వచ్చినా కాంగ్రెస్ నేతల స్వాగత సంబరాల కార్యక్రమంతో వాహనాలు మధ్యలోనే నిలిచిపోయాయి. 108లు కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. అరగంటపాటు కొట్టుమిట్టాడి రాజయ్య తుదిశ్వాస విడిచాడు. కాసేపటికి 108 వాహన ఉద్యోగులు వచ్చి చూసి ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. ప్రమాదం 5-40కి జరగగా ప్రమాదస్థలికి 108 వాహనం 6-20కి చేరింది. రాజయ్యకు ఐదుగురు కూతుళ్లు కాగా కరీంనగర్‌లో ఉన్న మూడో కూతురు ఇంటికి వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసుకుని స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సకాలంలో 108 వాహనం రాలేదని, రోడ్డుపై ఎవరూ వాహనాలను ఆపలేదని, చికిత్స త్వరగా అంది ఉంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు తెలిపారు. నేతల హంగామా, ట్రాఫిక్ జామ్‌పై ప్రయాణికులు, మృతుడి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 రోజుకో హంగామా
 తెలంగాణ తామే సాధించామని రాజీవ్ రహదారిపై రోజుకో స్వాగత సంబరాల హంగామా కొనసాగుతుండగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  22న టీఎన్జీవో నాయకులు, 24న టీఆర్‌ఎస్ నాయకులు, 25న కాంగ్రెస్ నాయకులు భారీ కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం సమయం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అధికారులు స్పందించి ఇబ్బందులు తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement