పసుపు పూత.. నిధుల మేత
ఆరోగ్య కేంద్రాలకు పసుపు రంగు పూయాలంటూ ఉత్తర్వులు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పేర్లు మార్పు
ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న వైద్య సిబ్బంది
గుంటూరు మెడికల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పేర్లను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా ఆగస్టు 15 నుంచి మార్పు చేశారు. ఆరోగ్య కేంద్రాలకు పసుపు రంగు పూయాలని ఉత్తర్యుల్లో పేర్కొనటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ఆరోగ్య కేంద్రానికి పేర్లు మార్పు చేసి, కొద్దిపాటి రంగులు వేసినందుకు సుమారు రూ.40వేలు కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రోగులకు మందులు ఇతర అవసరాల కోసం వాడాల్సిన నిధులను ఆరోగ్య కేంద్రాలకు పెయింటింగ్స్ పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే...
జిల్లాలోని పెదనందిపాడు, వెనిగండ్ల, వట్టిచెరుకూరు, గొట్టిపాడు, కాట్రపాడు, పెదపలకలూరు ఆరోగ్య కేంద్రాలకు ఇటీవల కాలంలో పేర్లు మార్పు చేశారు. ఆరోగ్య కేంద్రం ముందు ఉన్న ప్రహారీకు రంగులు వేసి, స్టిక్లర్లు అంటించి ఆగస్టు 15 నుంచి ఆరోగ్య కేంద్రాలను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా మార్పు చేస్తున్నట్లు వైద్యాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లాలో 86 ఆరోగ్య కేంద్రాలు ఉండగా వాటిల్లో 32 ఆరోగ్య కేంద్రాలను వెల్నెస్ సెంటర్లుగా మార్పు చేయాలని వైద్యాధికారులు నిర్ణయించారు. సెప్టెంబర్ 15 నుంచి 32 ఆరోగ్య కేంద్రాల్లో నాన్ కమ్యూనకబుల్ డిసీజ్( ఎన్సీడీ) కార్యక్రమంలో భాగంగా మెన్మాస్టర్హెల్త్ చెక్అప్ ప్రారంభించాలని జిల్లా వైద్యాధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఎంపీహెచ్ఎస్( మేల్), ఎంపీహెచ్ఈఓలు స్క్రీనింగ్ చేసి ప్రతి శనివారం ఆన్లైన్లో వివరాలను నమోదు చేయాల్సి ఉంది. అయితే జిల్లా వైద్యాధికారులు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎన్ని ఆరోగ్య కేంద్రాలకు రంగులు వేయాల్లో తెలియజేయకుండా అన్ని ఆరోగ్య కేంద్రాలకు అని పేర్కొనటంపై గందరగోళం నెలకొంది. పెయింటింగ్ పనులను టెండర్ల ద్వారా లేదా కొటేషన్ల ద్వారా అప్పగించకుండా ఓ పెయింటింగ్ కాంట్రాక్టర్కు అప్పగించారని సమాచారం. కాంట్రాక్టర్ అన్ని ఆరోగ్య కేంద్రాలకు ఫోన్లు చేసి పెయింటింగ్స్ వేసేందుకు వస్తున్నామని సిద్ధంగా ఉండాలని ఫోన్లు చేస్తున్నారు. డీఎంహెచ్వో కార్యాలయం నుంచి సైతం కాంట్రాక్టర్కు వత్తాసుగా ఫోన్లు చేస్తూ పెయింటింగ్స్ వేయించుకోవాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఆస్పత్రి అభివృద్ధి సంఘం అనుమతి తీసుకుని పెయింటింగ్స్ వేయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా నేరుగా ఒకే కాంట్రాక్టర్ అన్ని ఆరోగ్య కేంద్రాలకు పసుపు రంగు వేసి నిధులు నొక్కేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
సిబ్బంది లేకుండా ఎలా....
ప్రభుత్వం, అధికారులు ఆరోగ్య కేంద్రాల్లో నూతనంగా ఏ ఒక్కరిని నియమించకుండా కొత్త కొత్త ఆరోగ్య కార్యక్రమాలను ప్రవేశపెట్టి సిబ్బందిపై ఒత్తిడిని పెంచుతున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరికరాలను ఇవ్వకుండా, వైద్య సిబ్బందిని నియమించకుండా ఆరోగ్య కేంద్రాల్లో నూతన వైద్యసేవలను అందిస్తామని ప్రగల్భాలు పలికితే ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది, వైద్యసేవలకు వచ్చే రోగులు ఇబ్బంది పడటం మినహా ఎలాంటి ప్రయోజనం చేకూరదని సిబ్బంది వాపోతున్నారు. కార్యక్రమాల పేర్లుతో సున్నాలు వేస్తూ నిధులు ఖర్చుచేసే బదులు కనీసం కాంట్రాక్ట్లో నైనా కొంత మంది సిబ్బందిని నియమించి మందులు, వైద్య పరికరాలు ఆరోగ్య కేంద్రాలకు అందిస్తే మెరుగైన వైద్యసేవలను గ్రామీణ పేద రోగులకు అందించే అవకాశం ఉంది. ప్రభుత్వం, వైద్యాధికారులు ఆ దిశగా ఆలోచనలు చేయాలని వైద్య సిబ్బంది, రోగులు కోరుతున్నారు.
ఉయ్యాలలు కట్టాలని ఆదేశాలు.!
ఆరోగ్య కేంద్రాల్లో కాన్పు కోసం వచ్చి పుట్టిన బిడ్డను ఎవరైనా వదలి వెళ్లాలనుకుంటే వారు ఎక్కడ పడితే అక్కడ బిడ్డలను వదిలి వెళుతున్నారు. అలా కాకుండా ఆరోగ్య కేంద్రాల్లో ఉయ్యాలలు కడితే బిడ్డలను వదలివేయాలనుకునే వారు ఉయ్యాలలో వదిలిపెట్టి వెళ్తే వారిని శిశు సంక్షేమశాఖ అధికారులు పెంచేందుకు తీసుకెళ్తారనే ఉద్ధేశంతో ఆరోగ్య కేంద్రాల్లో ఉయ్యాలలు కట్టాలని ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారులు ఆరోగ్య కేంద్రాల్లో ఉయ్యాలలు కట్టాలని ఆదేశాలు ఇవ్వటంపై వైద్య సిబ్బంది ఆశ్చరాన్ని వ్యక్తం చేయటంతో పాటుగా విమర్శలు చేస్తున్నారు. ఏ నిధుల నుంచి ఉయ్యాలలను కొనుగోలు చేయాలో చెప్పకుండా ఉయ్యాలకు రక్షణగా ఎవరు ఉండాలో చెప్పకుండా ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఇవ్వటమేమిటని ప్రశ్నిస్తున్నారు. వైద్యం చేయాల్సిన సిబ్బంది ఉయ్యాలకు కాపలాగా ఎలా ఉంటారని మండిపడుతున్నారు. కాగా ఈ విషయాలపై సాక్షి వివరణ కోరేందుకు డీఎంహెచ్ఓకు ఫోన్ చేయగా ఆమె సెలవులో ఉండటంతో స్పందించలేదు.