
మీ సేవలు చిరస్మరణీయం
కడప అర్బన్ : సుదీర్ఘ కాలంపాటు పోలీస్ శాఖకు విశేష సేవలందించి పదవీ విరమణ పొందడం అభినందనీయమని జిల్లా ఎస్.పి ఈ.జి అశోక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మే నెలాఖరున పదవీ విరమణ పొందిన వి.మోహన్ రావు ఏ.ఎస్.ఐ (ఒంటిమిట్ట పి.ఎస్), పి.భాస్కర్ ఏ.ఎస్.ఐ (జమ్మలమడుగు పి.ఎస్), ఈ.రామన్న ఏ.ఆర్.హెచ్.సి 484, (డీ.ఏ.ఆర్, కడప), బి.నారాయణ హెచ్.సి 1956 (కడప టూ టౌన్ పి.ఎస్) లను జిల్లా ఎస్.పి ఈ.జి అశోక్ కుమార్ శాలువా కప్పి సన్మానించి జ్ఞాపికలు అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ పోలీస్ శాఖలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం సేవ చేస్తూ పదవీ విరమణ పొందడం అదృష్టమన్నారు. విధి నిర్వహణలో అందించిన సేవలే ఉద్యోగానంతరం కూడా గుర్తుండిపోయేలా మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తాయన్నారు. విధి నిర్వహణలో అప్పటి కఠిన పరిస్థితుల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం సాధారణ విషయం కాదని, నిబద్ధత, అంకితభావంతో జిల్లా పోలీస్ శాఖకు అందించిన సేవలను శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబంలో సభ్యులేనని, భవిష్యత్తులో ఎలాంటి సహాయం కావాలన్నా పోలీస్ శాఖ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని జిల్లా ఎస్.పి భరోసా ఇచ్చారు. సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్.పి బి.రమణయ్య, ఎ.ఆర్. డీఎస్పీ కె. శ్రీనివాసరావు, ఆర్.ఐ ఆనంద్, వీరేష్, శ్రీశైల రెడ్డి, శివరాముడు, టైటస్, డి.పి.ఓ ఏ.ఓ జ్యోతి, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పదవీ విరమణ పొందిన సిబ్బంది కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బంది వీడ్కోలు సమావేశంలో జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్